20 ఏళ్ల నిర్బంధం.. 9 మంది పిల్లలకు తల్లి... సవతి కూతురికి ప్రత్యక్ష నరకం..
మైనర్ అయిన తన సవతి కూతురిని కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని 9మంది పిల్లలకు తల్లిని చేసిన హెన్రీ మైకెల్ పియెట్(65) అనే వ్యక్తికి ఓక్లహామా ఫెడరల్ కోర్టు పియెట్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే 50వేల డాలర్ల జరిమానాతో పాటు.. బాధితురాలికి 50,067డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 2017లో మొదటిసారి హెన్రీ ఆకృత్యం వెలుగుచూడగా.. అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది.
1997లో కిడ్నాప్..
పీపుల్ టీవీ కథనం ప్రకారం.. రొసాలిన్ మెక్గిన్నీస్ 9వ ఏట ఆమె తల్లి హెన్రీ మైకెల్ పియెట్తో డేటింగ్లో ఉంది. అయితే అతని వేధింపులు తట్టుకోలేక ఆమె అతని నుంచి విడిపోయింది. కూతురు మెక్గిన్నీస్తో కలిసి వేరుగా నివసించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు 1997లో పియెట్.. మెక్గిన్నీస్ చదువుతున్న స్కూల్ వద్దకు వెళ్లి ఆమెను కిడ్నాప్ చేశాడు. అక్కడినుంచి ఆమెను మెక్సికో తీసుకెళ్లి నిర్బంధించాడు.
ప్రత్యక్ష నరకం..
మెక్సికోలోని ఓ షెడ్డులో రొసాలిన్ మెక్గిన్నీస్ను నిర్బంధించిన పియెట్.. ఆమెపై ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు. ప్రత్యక్ష నరకం చూపించాడు. మెక్సికో వెళ్లిన తర్వాత ఎన్నో మారుపేర్లు పెట్టుకున్న పియెట్.. రొసాలిన్ను తన రూపం మార్చుకోవాల్సిందిగా బలవంతం చేసేవాడు.షెడ్డు నుంచి తాను బయటకెళ్లినప్పుడు తాళం వేసి వెళ్లేవాడు. మొదట్లో పారిపోవాలని ప్రయత్నించిన రొసాలిన్.. ఆ తర్వాత నిస్సహాయ స్థితిలో,మానసిక స్థైర్యం కోల్పోయి అక్కడే చిక్కుకుపోయింది. ఈ క్రమంలో పియెట్ ఆకృత్యాలకు ఆమె 9మంది పిల్లలకు తల్లి అయింది. 2000వ సంవత్సరంలో 15 ఏళ్ల వయసులో ఆమె మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.
2016లో తప్పించుకున్న రొసాలిన్ మెక్గిన్నీస్..
సవతి కూతురితో తొమ్మిది పిల్లలను కన్న పియెట్.. వారి ఆలనా,పాలనా గాలికి వదిలేశాడు. అందర్నీ షెడ్డులోనే నిర్బంధించి అరకొర తిండి పెట్టి వేధించాడు. ఈ క్రమంలో ఆమె పెద్ద కొడుకు ఇంటి నుంచి పారిపోయాడు. కొన్నాళ్ల తర్వాత రొసాలిన్ ఎలాగైనా అక్కడినుంచి బయటపడాలని నిశ్చయించుకుంది. అలా 2016లో ఎలాగోలా తన 8 మంది పిల్లలతో ఆ ఇంటి నుంచి బయటపడి అమెరికన్ ఎంబసీ అధికారులను ఆశ్రయించింది. 1997 నుంచి దాదాపు 20 ఏళ్లుగా తాను అనుభవించిన నరకం గురించి.. పియెట్ ఆకృత్యాల గురించి వారికి వివరించింది.
జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
చివరకు అధికారుల సహాయంతో రొసాలిన్ పియెట్పై కేసు పెట్టగా.. ఓక్లహామా పోలీసులు 2017లో అతన్ని అరెస్ట్ చేశారు. కేసును విచారించిన ఓక్లహామ ఫెడరల్ కోర్టు పియెట్కు జీవిత ఖైదు విధించింది. అయితే రొసాలిన్కు జరిగిన అన్యాయం పూడ్చలేనిది అని.. జీవితకాలం ఆమెను భయంకరమైన జ్ఞాపకాలు వేధిస్తాయని అమెరికా అటార్నీ బ్రియాన్ జే. కుస్టర్ పేర్కొన్నారు. ఆమె పట్ల సానుభూతి తెలపడం తప్ప చేయగలిగిందేమీ లేదని వాపోయారు.