ఐశ్వర్యని కల్సి సీక్రెట్ అడగాలనుకున్న ఇరాకీ బ్యూటీ
ఇరాక్: బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ను కలవటం తన కల అని మిస్ ఇరాక్ శయ్మా ఖాసిమ్ అంటున్నారు. ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. తాజాగా, శయ్మా మిస్ ఇరాక్ కిరీటం గెలుచుకుంది.
దీనిపై ఆమె మాట్లాడుతూ... భారత్ వెళ్లి, ఐశ్వర్యా రాయ్ని కలవాలన్నది ఒకప్పుడు తన కల అని చెప్పారు. అంతేకాదు, బ్యూటీ క్వీన్గా గెలవాలంటే ఏం చేయాలని, విజయ రహస్యం ఏమిటని తాను ఐశ్వర్య రాయ్ని అడగాలనుకున్నానని చెప్పారు. ఆమె గురించి తాను చదివానని చెప్పారు.
కాగా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలు, అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న ఇరాక్లో 1972 తర్వాత తొలిసారి ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఉగ్రవాదుల బెదిరింపులు, ఇతరత్రా అపోహలు, ఒత్తిళ్లు లెక్కచేయకుండా ఎంతోమంది యువతులు ముందుకు వచ్చి ధైర్యంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు.
కిర్కుక్ ప్రాంతానికి చెందిన శయ్మా ఖాసిం మిస్ ఇరాక్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇరవై ఏళ్ల ఈ సుందరి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నారు. ఆమె మాట్లాడుతూ... తాను ఎవరికీ భయడపనని, ఎందుకంటే ఏ తప్పూ చేయలేదనే నమ్మకముందని తెలిపారు.
ఇరాక్లో మహిళలకూ పురుషులలాగే అన్ని హక్కులు ఉంటాయని నిరూపించడం, సమాజంలో మహిళలు ఉనికిని చాటుకోవాలని అవగాహన కల్పించాలని ఉందన్నారు. ఇరాకీ మహిళల విషయంలో పాజిటీవ్ చరిత్ర ఉందని, ఇక్కడి మహిళలకు పూర్వవైభవం రావాలన్నారు.