ఎంహెచ్ 370 జలసమాధి: ఐదుగురు భారతీయులు వీరే
కౌలాలంపూర్: మలేషియా విమానం ఎంహెచ్ 370 దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని సోమవారం కౌలాలంపూర్లో విలేకరుల సమావేశంలో మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. ఉపగ్రహ తాజా సమాచారం ఆధారంగా నిర్ధారించుకున్నట్లు చెప్పారు. శకలాల కోసం అన్వేషన కొనసాగుతుందన్నారు.
మలేసియా ప్రధాని ప్రకటనతో ఐదుగురు భారతీయులు సహా మొత్తం 239తో అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్-370పై రెండున్నర వారాలుగా కొనసాగుతున్న మిస్టరీకి తెరపడింది. కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు వెళ్తూ 17 రోజుల క్రితం గల్లంతైన ఈ విమానం దక్షిణ హిందూ మహా సముద్రంలోని మారుమూల ప్రాంతంలో కూలిపోయిందని, అందులోని వారెవరూ బతకలేదని, ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని రజాక్ ప్రకటించారు.
బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ విమానం ఈ నెల 8వ తేదీన వినువీధిలో అదృశ్యమైంది. మలేషియా రాజధాని నుంచి బయలుదేరిన ఈ విమానం దక్షిణ హిందూ మహా సముద్రంలోని మారుమూల ప్రాంతంలో కూలిపోయినట్టు ఉపగ్రహం నుంచి అందిన తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోందని, అత్యంత విషాదకరమైన ఈ వార్తను ప్రకటించేందుకు ఎంతగానో విచారిస్తున్నాని సోమవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నజీబ్ రజాక్ తెలిపారు.
ఇది అత్యంత విషాద సంఘటన అని, ఈ విమానంలోని తమ ఆప్తుల జాడ కోసం వారి కుటుంబ సభ్యులు గత కొద్ది వారాల నుంచి తీవ్రమైన మనోవేదన అనుభవిస్తున్నారని, వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని ఆయన అన్నారు.
ఐదుగురు భారతీయులు
ఈ విమానంలో ఉన్న ఐదుగురు భారతీయుల్లో నలుగురు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, ఒకరి చెన్నైకి చెందినవారిగా తెలుస్తోంది. భారతీయుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. చేత్నా కోలేకర్, స్వానంద్ కోలేకర్, వినోద్ కోలేకర్ ున్నారు. మరో ఇద్దరు చంద్రికాశర్మ, క్రాంతి శిర్ సతాలు ఉన్నారు.
కాగా, ఆస్ట్రేలియాలోని పెర్త్ తీరానికి పశ్చిమ దిశలో దాదాపు 2,500 కిలోమీటర్ల దూరాన నీటిపై అనేక వస్తువులు తేలియాడుతుండటాన్ని ఆస్ట్రేలియా, చైనా విమానాలు గుర్తించినట్టు వార్తలు వెలువడటంతో నజీబ్ రజాక్ ఈ ప్రకటన చేశారు. అయితే ఈ విమాన శకలాల విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఈ విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రదేశం ఏది? ఏ కారణం వలన అది కూలిపోయింది? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదు.