అటల్లా హిందీలో: మోడీ జీ-ఆల్, సమన్ల నుండి రక్షణ
న్యూయార్క్: జీ 5, జీ20.. ఇలా కొన్ని రకాల గ్రూపులు ఎందుకని, మనందరి ధ్యేయం ఒక్కటే అయినప్పుడు మనకిప్పుడు కావాల్సింది జీ- ఆల్ కదా.. ప్రపంచ మానవాళి చక్కటి మనుగడే అందరి లక్ష్యమైనప్పుడు.. దానిని సాధించేందుకు అందరం కలిసి జీ ఆల్గా ఏకమవడం తక్షణ అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఐరాసలో సంస్కరణలు చేపట్టాలని సూచించారు.
ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 69వ సమావేశంలో మోడీ 35 నిమిషాలపాటు హిందీలో ప్రసంగించారు. ఎప్పటిలా ఐరాసలో మోడీ ప్రసంగం ఆకట్టుకుంది. కాగా, ఐరాస సాధారణ సభలో ప్రసంగం విషయంలో మోడీ మాజీ ప్రధాని వాజపేయి అడుగుజాడల్లో నడిచారు. ఐరాస సాధారణ సభను ఉద్దేశించి హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రధానిగా వాజపేయి ప్రత్యేకత సాధించారు. అంతకుముందు 1977లో జనతాపార్టీ అధికారంలో ఉన్నప్పుడు విదేశాంగ మంత్రి హోదాలోను ఆయన హిందీలోనే ప్రసంగించారు.
9/11 మెమోరియల్ను సందర్శించిన మోడీ
మోడీ తన అమెరికా పర్యటన రెండో రోజును శనివారం9/11 దాడుల్లో మృతులకు నివాళులర్పించడంతో ప్రారంభించారు. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ను అల్ఖైదామిలిటెంట్లు విమానాలతో ఢీకొట్టి కూల్చివేసిన సంఘటనలో పలువురు భారతీయులు సహా 3 వేల మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే.
కూలిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉన్న స్థలంలో ఒక జాతీయ స్మృతి చిహ్నాన్ని, మ్యూజియంను అమెరికా ప్రభుత్వం నిర్మించింది. ఈ మెమోరియల్ను, మ్యూజియంను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ ఏడాది మేలో ప్రారంభించారు. తెల్లటి కుర్తా, పైజమా, మట్టి రంగు కండువా ధరించిన మోడీ శనివారం ఉదయాన్నే ఈ స్మారక చిహ్నాన్ని, మ్యూజియంను సందర్శించారు.
న్యూయార్క్ ప్రజలకు మోడీ కృతజ్ఞతలు
న్యూయార్క్ చేరుకున్న తర్వాత తనకు హృదయపూర్వకంగా స్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. మోడీ బస చేసిన హోటల్ వెలుపల పెద్ద సంఖ్యలో చేరిన ప్రవాస భారతీయులు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. ‘న్యూయార్క్లో సాదర స్వాగతం పలికినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గొప్ప పర్యటనకోసం ఎదురు చూస్తున్నాను' అని మోడీ ట్విట్టర్లో ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు.
మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రశంసాపత్రం జారీ చేసిన కొలంబస్
మోడీ అమెరికాలో తొలిసారిగా జరుపుతున్న పర్యటనను పురస్కరించుకుని మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్తో సోదర నగర సంబంధం కలిగి ఉన్న ఓహియో రాష్ట్రంలోని కొలంబస్ నగర మేయర్ ఒక ప్రశంసా పత్రాన్ని విడుదల చేసారు. ఈ ప్రత్యేక సందర్నాన్ని గుర్తించడంలో నగర పౌరులందరూ తనతో పాలుపంచుకోవాలని ఆ ప్రశంసాపత్రంలో కొలంబస్ నగర మేయర్ మైకేల్ కోల్మన్ విజ్ఞప్తి చేశారు.
2008నుంచి కొలంబస్ నగరానికి అహ్మదాబాద్తో సోదర సంబంధాలున్నాయి. 2008నుంచి ఈ రెండు నగరాలు తన స్నేహసంబంధాలను బలోపేతం చేసుకున్నాయని, ఈ బంధం ప్రయోజనాలను నేటి తరంనుంచి భావి తరాలకు అందించే విధంగా తీర్చిదిద్దాయని మేయర్ ఆ ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు.
సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన అహ్మదాబాద్ బలమైన ప్రగతి శీల ప్రభుత్వానికి ఒక అదర్శమని, కొలంబస్ నగరం అమెరికాలోని భారతీయులను తమ సంస్కృతిలో భాగంగా కలిపేసుకుందని, సమాజానికి వారు అందించిన సేవలతో సుసంపన్నమైందన్నారు. ఓహియో రాష్ట్ర సెనేటర్ షెరాడ్ బ్రౌన్ సైతం మోదీకి రాసిన ఒక లేఖలో ప్రధానమంత్రిగా తొలిసారి అమెరికా సందర్శిస్తున్న మోడీనిస్వాగతించారు.
సమన్ల నుండి మోడీకి రక్షణ
అమెరికాలో అయిదు రోజుల పర్యటనకోసం ఇక్కడికి చేరుకున్న మోడీకి సమన్ల నుండి చట్టపరంగా పూర్తి రక్షణ ఉందని, ఆయనకు ఎవరు కూడా ఎలాంటి సమన్లూ జారీ చేసే ప్రసక్తి లేదని, ఈ వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతోందని భారత ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన మతఘర్షణల్లో ఆయనకు పాత్ర ఉందని ఆరోపిస్తూ దాఖలయిన ఒక కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు ఒకటి శుక్రవారం సమన్లు జారీ చేసిన ఒకరోజు తర్వాత భారత ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది.
మరోవైపు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ కూడా ఈ వ్యవహారాన్ని తేలిగ్గా కొట్టివేసింది. ఈ కేసు అత్యంత ముఖ్యమైన మోడీ పర్యటనపై ఎలాంటి ప్రభావం చూపించదని, అమెరికాను సందర్శించే దేశాధినేతలకు దేశంలో ఉండే సమయంలో వ్యక్తిగతంగా పూర్తి రక్షణ ఉంటుందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జోస్ ఎర్నెస్ట్ చెప్పారు. అంటే దీని అర్థం కేసుకు సంబంధించి ఎలాంటి పథ్రాలను వారికి నేరుగా అందజేయడానికి వీలుండదు.