ఇంగ్లీష్ మాట్లాడాడని షరీఫ్పై కేసు, ఒబామా చెప్తుంటే..
కరాచీ: అధికార భాషను కాకుండా ఇంగ్లీషులో మాట్లాడినందుకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పైన పాకిస్థాన్ సుప్రీం కోర్టులో కేసు నమోదైంది. 70వ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో షరీఫ్ ఇంగ్లీషులో మాట్లాడారని, ఇది పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకమని జహీద్ ఘనీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.
దీంతో, కేసు నమోదుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు డాన్ పత్రిక వెల్లడించింది. ఇవే సమావేశాల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆ దేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హిందీలో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.
రష్యన్ భాషలో వ్లాదిమిర్ పుతిన్, చైనా భాషలో జిన్ పింగ్, జపాన్ భాషలో షింజో అబేలు ప్రసంగిస్తే... నవాజ్ షరీఫ్ మాత్రం పాకిస్తాన్ అధికార భాషను కాకుండా ఇంగ్లీషులో మాట్లాడటం, జాతికే అవమానకరమన్నాడు. ఇది తీవ్రమైన నేరమని, విచారించి శిక్షించాలని జహీద్ కోరాడు.
కాగా, నవాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన సమయంలో.... తాను మాట్లాడటం కంటే, ఒబామా చెప్పిందే ఎక్కువగా వినేందుకు ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది.
మరోవైపు, అమెరికా పర్యటించిన పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు రెండు రోజుల క్రితం నిరసన సెగ తగిలింది. తన సొంత దేశం బెలూచిస్థాన్కు చెందిన ఓ నిరసనకారుడు షరీఫ్ను ఘెరావ్ చేశాడు. అమెరికాలోని ప్రముఖ మేధో సంస్థ యూఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇది జరిగింది.
బెలూచిస్థాన్కు విముక్తి కల్పించండనే నినాదంతో ఆందోళనకు దిగిన నిరసనకారుడు... నువ్వూ లాడెన్ స్నేహితుడివేనంటూ షరీఫ్ పైన మండిపడ్డాడు. ఊహించని పరిణామంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తేరుకుని అతడిని బయటకు తీసుకెళ్లారు.