ఎవర్ని మోసం చేద్దామని: రష్యా ప్రకటనపై అమెరికా నిప్పులు: ఏ క్షణమైనా మరింత తీవ్రంగా
వాషింగ్టన్: నెలరోజులకు పైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతూ వచ్చిన భీకర యుద్ధానికి పుల్స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. ఇప్పట్లో ఈ యుద్ధానికి అంతు అనేదే ఉండకపోవచ్చంటూ వార్తలు వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. వెనక్కి తగ్గింది. రష్యాతో వెనకడుగు వేయించడానికి పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించనప్పటికీ- టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా సాగిన శాంతి చర్చలు కొంత ప్రభావాన్ని చూపాయి. ఈ చర్చల పాక్షికంగా సఫలం అయ్యాయి.

ఆ రెండు నగరాల నుంచి
రాజధాని కీవ్, చెర్నిహివ్ నుంచి సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడానికి రష్యా అంగీకరించింది. ఈ రెండు నగరాల నుంచి తమ సైనిక బలగాలను భారీగా తగ్గిస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉప మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ వెల్లడించారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయని చెప్పారు. శాంతి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా- తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

మూడు గంటల భేటీ..
ఆ అజెండాతో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు ఇస్తాంబుల్లో సమావేశం అయ్యారు. మూడు గంటలకు పైగా వారి మధ్య చర్చలు కొనసాగాయి. అవి కొంతవరకు ఫలించినట్టే కనిపిస్తోన్నాయి. రష్యా కొంత సానుకూలంగా వ్యవహరించింది. ఇదివరకు నిర్వహించిన శాంతి చర్చల సందర్భంగా ఉక్రెయిన్ ప్రతిపాదించిన అంశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని రష్యా.. తన వైఖరిని మార్చుకుంది. సానుకూలంగా వాటిని పరిశీలనలోకి తీసుకున్న అనంతరం ఈ ప్రకటన చేసింది.

తప్పు పట్టిన అమెరికా..
కీవ్, చెర్నిహివ్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామంటూ రష్యా చేసిన ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా స్పందించింది. ఈ ప్రకటనను తప్పు పట్టింది. మోసపూరితమైన ప్రకటనగా అభివర్ణించింది. దీనికి బదులుగా రష్యా ఏ క్షణంలోనైనా తన సైనిక బలగాలను మరింత పెంచే ప్రమాదం లేకపోలేదని, దాడుల తీవ్రతనూ రెట్టింపు చేయొచ్చని ఆరోపించింది. పూర్తిస్థాయిలో యుద్ధం నిలిపివేయకుండా సైన్యాన్ని ఉపసంహరించుకుంటామంటే ఎవరు విశ్వసించబోరని పేర్కొంది.

కళ్ల ముందే విధ్వంసం..
తమ కళ్ల ముందే ఉక్రెయిన్లో రష్యా విధ్వంసపర్వం కొనసాగుతోందని, అలాంటి పరిస్థితుల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామంటూ రష్యా ప్రకటించడాన్ని విశ్వసించట్లేదని వైట్హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్ఫీల్డ్ అన్నారు. మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేసిందని విమర్శించారు. వెనక్కి తీసుకోవడానికి బదులుగా ఏ క్షణమైనా సైనిక చర్యను మరింత తీవ్రతరం చేయొచ్చని, దాడులను పెంచుతుందని పేర్కొన్నారు.

పెంటగాన్ సైతం..
పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ సైతం ఇదేరకంగా స్పందించారు. రష్యా చేసిన ప్రకటనను ఆయన తప్పుపట్టారు. రష్యా చేసిన ప్రకటనను తాము విశ్వసించలేమని స్పష్టం చేశారు. రష్యా సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పిందే తప్ప.. కాల్పలు విరమణ చేస్తామని ప్రకటించలేదని జాన్ కిర్బీ గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ క్షణమైనా రష్యా దాడులను తీవ్రం చేయొచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications