ట్రంప్ భేటీ ఎఫెక్ట్: ముగ్గురు అమెరికన్ ఖైదీలను విడుదల చేసిన ఉ.కొరియా
వాషింగ్టన్/ప్యాంగ్యాంగ్: తమ నిర్బంధంలో ఉన్న అమెరికాకు చెందిన ముగ్గురు పౌరులను ఉత్తరకొరియా విడుదల చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య త్వరలో జరగనున్న చరిత్రాత్మక సమావేశం నేపథ్యంలో ఉత్తరకొరియా.. అమెరికా ఖైదీలను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
శిఖరాగ్ర సదస్సు ఏర్పాట్లలో భాగంగా ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయోతో పాటు ఈ ముగ్గురు ఖైదీలు కూడా తిరిగి వస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, ఉత్తరకొరియా విడుదల చేసిన కిమ్ హాక్ సాంగ్, టోనీ కిమ్, కిమ్ డోంగ్ చు అనే ముగ్గురూ విమానంలో ఎవరి సాయం లేకుండా నడవగలుగుతున్నారు అని అమెరికా అధ్యక్ష భవనం వాట్ హౌస్ వెల్లడించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై వారిని ఉత్తరకొరియా అరెస్ట్ చేసి శ్రామిక శిబిరాలకు పంపింది.
ఖైదీల విడుదలను ట్రంప్ అభినందించారని, సానుకూల సంకేతంగా ఈ చర్యను ఆయన పరిగణిస్తున్నారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా సాండర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ముగ్గురు ఖైదీలో కూడా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోందని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్తో భేటీ కోసం తేదీ, వేదికను కూడా ఖరారు చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు.