పాకిస్థాన్ లో అత్యవసర పరిస్థితి విధింపు - 937 మంది మృతి..!!
పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. దేశంలో భారీ విపత్తు సంభవించింది. భారీగా ప్రాణ నష్టం జరిగింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు పాకిస్తాన్ అతలాకుతలమైపోయింది. దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి చెందారు. సింధూ ప్రావిన్స్లో ఈ వరదల కారణంగా అత్యధిక సంఖ్యలో చనిపోయారని, సుమారు 306 మందికి పైగా తమ జీవనం కోల్పోయారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
దేశ వ్యాప్తంగా దాదాపు 30 మిలియన్ల మంది ఆశ్రయం కోల్పోయారు. పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చెబుతున్న లెక్కల ప్రకారం మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బలోచిస్తాన్లో 234 మంది, పంజాబ్ ప్రావిన్స్లో 165 మంది ఖైబర్ పంక్త్వులలో 185 మంది రికార్డు స్థాయిలో చనిపోయారని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
పాక్ ఆక్రమిత్ కాశ్మీర్లో 37 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్లో తొమ్మిది చనిపోయినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టులో పాకిస్తాన్లో 166.8 మి.మీటర్ల వర్షం కురిసింది. ఈ అసాధారణ వర్షాలకు దక్షిణ పాకిస్తాన్లోని దాదాపు 23 జిల్లాలో బాగా ప్రభావితమయ్యాయి. పాకిస్థాన్ ప్రభుత్వం సహాయక చర్యలకు ఆదేశించింది.
యుద్దప్రాతిపదికన ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు సేవలు అందించాలన సూచించింది. భారీ వరదలతో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి విషాదరకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆకస్మిక వరదలతో దేశంలోని పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తింది. మౌళిక వసతుల పైన ప్రభావం చూపింది.
లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆహారం కూడా అందటం లేదు. అంతర్జాతీయంగా తమకు సహాయం అవసరమని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించినా..అవి ఆశించిన స్థాయిలో కనిపించటం లేదు.