భారీ బాలిస్టిక్ మిస్సైల్స్తో పదే పదే పాక్ బలప్రదర్శన
Pakistan missile test: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
అటు పాకిస్తాన్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పానిక్ క్రియేట్ అయింది. భారత్ తీసుకున్న నిర్ణయాలను ఎలా తిప్పి కొట్టాలనే విషయంపై అక్కడి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

అదే సమయంలో మిస్సైల్ పరీక్షలకు దిగింది పాకిస్తాన్. ఉపరితలం నుండి ఉపరితలం వరకు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించాలని నిర్ణయించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం నాలుగుసార్లు క్షిపణి పరీక్షలను నిర్వహించింది పాకిస్తాన్. ఈ సారి మాత్రం బాలిస్టిక్ క్షిపణలను టెస్ట్ ఫైర్ చేయనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మేరకు నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) జారీ చేసింది పాకిస్తాన్. నోటమ్ అంటే- మిస్సైల్ పరీక్షలను నిర్వహించడానికి ముందు పౌర విమానాలు గానీ, రక్షణ విమానాలు గానీ సంబందిత గగనతలంపై రాకపోకలు సాగించకూడదంటూ ముందస్తు హెచ్చరికగా దీన్ని జారీచేస్తుంటుంది ఏ దేశమైనా.
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తరువాత పాకిస్తాన్ నోటమ్ జారీ చేయడం ఇది మూడోసారి. ఇదివరకు కిందటి నెల 23వ తేదీన తొలి నోటమ్ ఇచ్చింది. 24 గంటల పాటు అమలులో ఉండేలా దీన్ని ఇష్యూ చేసింది గానీ అప్పట్లో మిస్సైల్ టెస్టులను నిర్వహించినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఆ తరువాత 26, 27, 30, మే 2 తేదీల్లో మళ్లీ నోటమ్ జారీ చేసింది. అప్పుడు కూడా మిస్సైల్ టెస్టులను నిర్వహించినట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఇది భారత్లో ఉద్రిక్తతలను మరింత పెంచడానికి కారణమౌతోంది. నిర్లక్ష్యంగా రెచ్చగొట్టే చర్యగా భారత్ పరిగణిస్తోంది. అటు జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ (LoC), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాదాపుగా ప్రతీ రోజు కాల్పుల సంఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి.
పాకిస్తాన్ జాతీయులకు భారత వీసాలను నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్లో సిబ్బందిని తగ్గించాలని ఆదేశించడం, అట్టారి సరిహద్దును మూసివేయడం వంటి చర్యల తరువాత పాకిస్తాన్ తన బల ప్రదర్శనగా క్షిపణి పరీక్షలను ప్రయోగిస్తామంటూ బెదిరిస్తూ వస్తోంది. నిరంతరం నోటమ్లను జారీ చేస్తోంది.
అరేబియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్ర తీరాలను కలిగివుంది పాకిస్తాన్. మొత్తం 1,046 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందా దేశానికి. ఇందులో సింధ్ కోస్ట్- 270, మక్రాన్ కోస్ట్- 720 కిలోమీటర్లు. ఇండస్ డెల్టా రీజియన్ 150 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో అరేబియా తీరంలో క్షిపణి పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications