పదవీచ్యుతుడైన ఇమ్రాన్ : అవిశ్వాస పరీక్షలో క్లీన్ బౌల్డ్ : నేడు కొత్త ప్రధాని ఎన్నిక..!!
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. అనేక అనూహ్య పరిణామాలు..ఉత్కంఠ నడుమ అవిశ్వాస పరీక్షలో ఇమ్రాన్ పదవీచ్యుతుడయ్యారు. పాక్ చరిత్రలోనే అవిశ్వాసం ఓటింగ్ జరిగిన పదవి కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ నిలిచారు. ఈ తెల్లవారు జామున జరిగిన ఓటింగ్ లో ఇమ్రాన్ బలపరీక్షలో ఓడిపోయింది. మొత్తం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉండగా... 172 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, అనేక వాయిదాలు..ఉత్కంఠ నడుమ జరిగిన అవిశ్వస ఓటింగ్ లో ఇమ్రాన్ సర్కార్కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఆయాజ్ సాదిఖ్ ప్రకటించారు.

చివరి బంతికి ఇమ్రాన్ అవుట్
సుప్రీం కోర్టు ఆదేశాలతో ఓటింగ్ కోసం సభ శనివారం ఉదయం భేటీ అయింది. రాత్రి వరకు నాలుగు సార్లు వాయిదా పడింది. సభకు ఇమ్రాన్ గౌర్హాజరయ్యారు. ఓటింగ్ సమయంలోనూ ఆయన సభకు రాలేదు. ఓటింగ్ సమయంలో ఇమ్రాన్ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా, ఆయనపై తిరుగుబాటు జెండా ఎత్తిన సొంత పార్టీ సభ్యులు మాత్రం తమ సీట్లలోనే కొనసాగారు. చివరి బంతి వరకు పోరాడుతానని చెబుతూ వచ్చిన ఇమ్రాన్..అదే విధంగా శనివారం పరిణామాల నేపథ్యంలో మరింత ఉత్కంఠ పెంచారు. అటు ఓటింగ్ జరగకుండా సభ వాయిదా పడుతున్న సమయంలో..కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ అధినేత ఆయనతో భేటీ అయ్యారు.

నరాలు తెగే ఉత్కంఠ - కీలక పరిణామాలు
స్పీకర్ అసద్ ఖైసర్, డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరీ రాజీనామా చేశారు. ప్యానల్ ఛైర్మన్ అవిశ్వాసం పైన ఓటింగ్ నిర్వహించారు. తలుపులన్నీ మూసేసి ఓటింగ్ చేపట్టారు. 12.10కి ఓటింగ్ జరిగింది. 342 మంది సభ్యులున్న సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు కనీసం 172 మంది మద్దతు అవసరం. రాత్రి ఒంటిగంటకు 174 మంది అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం సులువుగా గట్టెక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ కావాలనే ధిక్కరిస్తున్నారంటూ విపక్షాలు మరోసారి కోర్టు తలుపు తట్టాయి. ఇమ్రాన్ దేశం విడిచిపోకుండా చూడాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది.

కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్
ఓటింగ్ జరగకుటే తిరిగి విచారించేందుకు వీలుగా అర్ధరాత్రి 12 తర్వాత కోర్టును సమావేశపరచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. కానీ, అటు జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ పూర్తి కావటం.. ఇమ్రాన్ పదవీచ్యుతుడు అవ్వటం జరిగిపోయాయి. ఇక, ఇమ్రాన్ స్థానంలో కొత్త ప్రధాని ఎంపిక ఈ రోజు జరగనుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అభ్యర్ధి షెహబాజ్ షరీఫ్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications