మోడీకి పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ థ్యాంక్స్-కశ్మీర్ కు శాంతి పరిష్కారం అనివార్యమని వెల్లడి
పాకిస్తాన్ లో అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ప్రధానిగా ఏకగ్రీవంగా విపక్షాలు ఎన్నుకున్న షెబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ఆయన కూడా స్పందించారు. ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు. అంతటితో ఆగకుండా కశ్మీర్ సమస్యపైనా షెబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెహబాజ్ షరీఫ్ను పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నందుకు అభినందించారు. భారతదేశం ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని, తద్వారా మనం మన అభివృద్ధి, సవాళ్లపై దృష్టి పెట్టగలమని అన్నారు.షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శుభాకాంక్షలు తెలిపిన వారిలో మోదీ కూడా ఉన్నారు. మార్చి 8న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఆయన ప్రమాణ స్వీకారం ముగింపు పలికింది.
పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే, షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని లేవనెత్తారు. లోయలోని ప్రజలు రక్తమోడుతున్నారని, పాకిస్తాన్ వారికి "దౌత్య, నైతిక మద్దతు" అందిస్తుందని ప్రకటించారు. తాను భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నానని, అయితే కాశ్మీర్ సమస్య పరిష్కారం లేకుండా అది సాధించలేమని అన్నారు. అది కేవలం భారత్ చేతిలో మాత్రమే లేదని పాకిస్తాన్ తోనూ ముడిపడి ఉందన్నారు. దురదృష్టవశాత్తూ భారత్తో పాకిస్థాన్ సంబంధాలు అంతా బాగోలేదన్నారు.
మరోవైపు తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు. భారత్తో శాంతియుత, సహకార సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటోందన్నరు. జమ్మూ కాశ్మీర్తో సహా అపరిష్కృతంగా ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం చాలా అవసరమని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ త్యాగం అందరికీ తెలిసిందేనన్నారు. శాంతిని కాపాడుకుందాం,మన ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడదామంటూ భారత్ కు ఆఫర్ ఇచ్చారుప.