ప్రమాదం అంచున పాకిస్థాన్.. 21 ఏళ్లలో ఇదే తొలిసారి..!
దాయాది దేశం పాకిస్థాన్ లో నిరుద్యోగం పెరిగిపోతుంది. నిరుద్యోగిత రేటు 7.1 శాతానికి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 21 ఏళ్లలో ఇదే అత్యధిక నిరుద్యోగిత రేటు అని పేర్కొంటున్నాయి. తాజాగా నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వేలో ఈ విషయం బయటకు వచ్చింది. పాకిస్థాన్ లో నిరుద్యోగం పై వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే పదేళ్లలో పాకిస్థాన్ లో దాదాపు 3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
అలాగే ఏటా 30 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అజయ్ బంగా స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్ లో యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 2025 లో దాదాపు 4 వేల మంది వైద్యులు ఆ దేశాన్ని వీడి ఇతర దేశాలకు వెళ్లారు. అలాగే మిగతా ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు కూడా భద్రత కారణాల దృష్ట్యా పాకిస్థాన్ ను వీడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగిత మరింతగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది.
2025 లో నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగిత 7.1 శాతానికి పెరిగింది. గత 21 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం అక్కడి పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ లోని షెహబాజ్ ప్రభుత్వం మాత్రం తాము దేశంలో ఆర్థిక స్థిరత్వం సాధించామని గొప్పలు చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఇక దేశంలో యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు మాత్రమే కాకుండా వృత్తిపరమైన గౌరవం, ఆర్థిక భద్రత లేకపోవడమే నిరుద్యోగానికి కారణం అని ది న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక కథనం ద్వారా స్పష్టం అవుతోంది.

పాకిస్థాన్లో ఎక్కడిక్కడ పరిశ్రమలు, తయారీ సంస్థలు మూతపడుతుండటం, తయారీదారులు విదేశాలకు తరలిపోతున్న క్రమంలో పాకిస్థాన్ ఆర్థిక రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందిన నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే..












Click it and Unblock the Notifications