కూలిన విమానం: ఇద్దరు ఇండియన్స్ సహా 62 మంది మృతి
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్కు చెందిన ప్యాసింజర్ విమానం రష్యాలోని రోస్తవ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది సహా మొత్తం 62 మంది మృత్యువాత పడ్డారు.
విమానంలో 57 మంది ప్రయాణికులు ఉండగా, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రమాదం శనివారం తెల్లవారు జామున జరిగింది. బోయింగ్ 737 విమానం దుబాయ్ నుంచి రోస్తవ్ విమానాశ్రయంలో కూలింది.
కూలిన వెంటనే అది మంటల్లో చిక్కుకుంది. విమానం దుబాయ్కి చెందిన ఎయిర్లైన్స్కు చెందింది.ప్రమాదానికి పొగమంచు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. విమానంలో ఉన్నవారంతా మరణించిననట్లు రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ తెలిపింది.
మృతుల్లో ఇద్దరు భారత పౌరులున్నారు. దుబాయ్ మీడియా కార్యాలయం నిర్వహించే అదికారిక ట్విట్టర్ మృతులు ఏయే దేశాలకు చెందినవారనే విషయాన్ని తెలిపింది. మృతుల్లో 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెయిన్కు, ఒకరు ఉబ్జెకిస్తాన్కు చెందివారున్నారు.
ఫ్లై దుబాయ్ విమాన యాన సంస్థకు చెందిన ఈ ఎఫ్జడ్ 981 విమానం కూలిపోవడంతో విమానాశ్రయాన్ని మూసి ఉంచుతున్నట్లు స్పుత్నిక్ వార్తాసంస్థ తెలిపింది. రష్యా నుంచి వస్తున్న కథనాల గురించి తమకు తెలుసునని, తమ బృందం ప్రమాదం గురించి మరిన్ని వివరాలను సేకరిస్తోందని బోయింగ్ ఎయిర్లైన్స్ చెప్పింది.