నో డబుల్ స్టాండర్డ్స్: ప్రధాని మోదీ ఇన్ డైరెక్ట్ వార్నింగ్- పాకిస్తాన్ పీఎం ఎదురుగానే
కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఆరంభమైన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 26వ సమ్మిట్ ఇది. సభ్య దేశాల అధినేతలు, ప్రధానులతో భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లను కలిశారు. రష్యా అధ్యక్షుడితో జరిగిన ప్రత్యేక ద్వైపాక్షిక చర్చల్లో పరస్పర సంబంధాల బలోపేతంతో పాటు అంతర్జాతీయ శాంతి స్థాపన ప్రాధాన్యత గురించి వివరించారు.
ఎస్సీఓ రౌండ్ టేబుల్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయా దేశాధినేతలతో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరు, సభ్యదేశాల సార్వభౌమాధికారం, రీజినల్ కనెక్టివిటీ వంటి అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే యురేషియా ప్రాంతంలోని ఇతర దేశాలతో సహకారాన్ని పెంచుకుంటోందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాజీపడబోమని తేల్చి చెప్పారు.

సరిహద్దు దేశాల ఉగ్రవాద విధానాల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్, ఇతర ఉగ్రవాద దేశాలు అనుసరిస్తోన్న వైఖరిని ఎండగట్టారు. ఉగ్రవాదంపై ద్వంద్వనీతిని అనుసరించవద్దని హెచ్చరించారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మరో వైపు దీన్ని అంతం చేస్తామంటూ మాట్లాడటం సరికాదని, ఇటువంటి వైఖరికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవడం, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను వీడాలని ప్రధాని మోదీ హితవు పలికారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, వారిని పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకోవడం, షెల్టర్ జోన్ లను ఏర్పాటు చేయడం వంటి విధానాలను ఏ దేశం కూడా ప్రోత్సహించబోదని, ఈ వ్యవస్థను సమూలంగా మట్టుబెట్టాల్సిందేనని చెప్పారు.
రీజినల్ కనెక్టివిటీని తాము ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, ఆ ప్రయత్నాలు ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించేలా ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రహదారులు, రైల్వేలు, ఎయిర్ కనెక్టివిటీ ద్వారా వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలని సూచించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ ఒక ప్రాంతంలో వచ్చే సంక్షోభాలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వ్యాపారాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఉదాహరణలతో వివరించారు.
ఎస్సీఓ సహకారం విషయంలో ప్రభుత్వాల మధ్యే కాకుండా, ప్రజల మధ్య సంబంధాలే అత్యంత కీలకమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అధునాతన సాంకేతిక సహాయంతో రైతులు, యువత, చిన్నతరహా వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను సృష్టించినప్పుడే వీటికి సార్థకత లభిస్తుందని వ్యాఖ్యానించారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే డ్రగ్స్ రవాణాను అరికట్టడం కూడా రీజినల్ సెక్యూరిటీ ఎంతో ముఖ్యమని అన్నారు.














Click it and Unblock the Notifications