మీ దేశాన్ని కాపాడుకోవడం మీకు చేత కాదు: మోడీ చురకలు!
హ్యూస్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి పాకిస్తాన్ పై చెలరేగిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఎదురు దాడికి దిగారు. పాకిస్తాన్ పేరు గానీ, ఇమ్రాన్ ఖాన్ పేరు ఎత్తకుండా.. పరోక్షంగా చురకలు అంటించారు. తమ దేశాన్ని సరిగ్గా కాపాడుకోలేని పొరుగువాళ్లు తమపై నిత్యం విషాన్ని కక్కుతున్నారని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ఏ మాత్రం భరించలేకపోతోందని మండిపడ్డారు. తమ దేశంలోని ఓ రాష్ట్రాన్ని భారత్ లో విలీనం చేయడం వల్ల పొరుగుదేశానికి వచ్చిన నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ.. హ్యూస్టన్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే మోడీ పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టారు.
ఆర్టికల్ 370ని ఎత్తేయడం వల్ల వచ్చిన బాధేంటీ?
జమ్మూ కాశ్మీర్ ను అఖండ భారతావనిలో విలీనం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, ఆ పని ఇదివరకు ఎవ్వరూ చేయలేకపోయారని మోడీ అన్నారు. రాజకీయ దృష్టితో కాకుండా.. జమ్మూ కాశ్మీర్ ప్రజల మేలు కోసమే తాము ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. భారత్ లోని మిగిలిన రాష్ట్రాలతో సమానంగా గుర్తింపు పొందాల్సిన హక్కు కాశ్మీరీలకు ఉందని, ఈ విషయాన్ని పొరుగు దేశం జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. అమెరికాలో అల్ ఖైదా దాడులు, ముంబైలో లష్కరే తొయిబా ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్, అమెరికా.. రెండూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్న దేశమేనని, వాటి మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసని అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి దేశంపైనా ఉందని గుర్తు చేశారు.
ఉగ్రవాదులను తయారు చేసి..
తన రక్షణ కోసం ఉగ్రవాదులను తయారు చేసిన ఆ దేశం.. ఇప్పుడదే ఉగ్రవాదుల బారిన పడి నలుగుతోందని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి స్వదేశాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఎలా సంరక్షించుకోవాలో తెలియని ఆ దేశ ప్రభుత్వం తమ పురోగమనాన్ని, ఉగ్రవాద నిర్మూలనా చర్యలను తప్పుపట్టుతోందని ఎద్దేవా చేశారు. స్వదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో, భారత్-అమెరికా మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచడంలో ప్రవాస భారతీయులు చేస్తోన్న కృషి గొప్పదని ప్రధాని అన్నారు. సమష్టిగా ఈ విజయాన్ని సాధించగలిగారని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేస్తోన్న ఘనత కూడా ప్రవాస భారతీయులదేనని చెప్పారు. స్వదేశంలో తాము సాధించిన విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని, తాము పుట్టిన గడ్డ ఎంత గొప్పదో.. తమ నైపుణ్యం ద్వారా చాటుతున్నారని కితాబిచ్చారు.