పాకిస్దాన్ మాజీ క్రికెటర్ ఇంటిపై పోలీసు దాడులు
న్యూఢిల్లీ: పాకిస్దాన్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇటీవల పాకిస్దాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) ప్రధాని నవాజ్ షరీఫ్ను రాజీనామా చేయాల్సిందిగా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.
ఈ రాజకీయ కారణాలతోనే పోలీసులు అబ్దుల్ ఖాదిర్ నివాసంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం పాకిస్దాన్ క్రికెట్ జట్టుకు ఆడే రోజుల్లో వీరిద్దరు మంచి స్నేహితులు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకి అబ్దుల్ ఖాదిర్ మద్దతుదారుడు.
అంతే కాకుండా అబ్దుల్ ఖాదిర్ కుమార్తె ఫాతిమా (24) పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ మహిళా విభాగం సీనియర్ సభ్యురాలు. ఖాదిర్ కుమారుడు కూడా పార్టీలో క్రీయాశీలక సభ్యుడు. ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఇమ్రాన్ ఖాన్కు మద్దతిస్తున్న కార్యకర్తలపై గత రెండ్రోజులుగా పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి.
తన నివాసంపై పోలీసుల దాడుల వ్యవహారంలో వ్యాఖ్యానించడానికి అబ్దుల్ ఖాదిర్ నిరాకరించారు. అయితే, శుక్రవారం రాత్రి ఖాదిర్ నివాసంపై పోలీసు దాడులు జరిగాయని పాకిస్దాన్లోని టీవీ చానళ్ళు ప్రసారాలు చేశాయి.