ఆయిల్ పైప్లైన్ బంద్.. పెరగనున్న పెట్రోల్ ధరలు?
మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆయిల్ సరఫరా వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఒకవైపు ఎర్రసముద్రంలోని కీలక తీరప్రాంతాలను ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటుండగా, మరోవైపు సౌదీ అరేబియాకు చెందిన ప్రధాన ఆయిల్ పైప్లైన్పై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం.. ముందు జాగ్రత్త చర్యగా తమ అతిపెద్ద "ఈస్ట్-వెస్ట్" క్రూడాయిల్ పైప్లైన్ను తాత్కాలికంగా పూర్తిస్థాయిలో మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల భయాలు మళ్లీ మొదలయ్యాయి.
డ్రోన్ల దాడితో భయం భయం
సౌదీ అరేబియా భూభాగంలో దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ కీలక పైప్లైన్పై గురువారం రాత్రి డ్రోన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. రియాద్, మదీనా రీజియన్ల పరిధిలోని పంపింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పేలుళ్ల ధాటికి కొన్ని పంపింగ్ కేంద్రాల్లో భారీగా మంటలు చెలరేగి, నల్లటి పొగలు అలముకున్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలు కాగా, ఆస్తి నష్టం అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయిల్ పంపింగ్ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇరాక్ బార్డర్ మూసివేత.. విచారణ వేగవంతం
ఈ దాడులు ఇరాక్ ప్రాంతం నుంచే జరిగాయని సౌదీ విదేశాంగ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే, ఘటనపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఇరాక్ ప్రధాని కోరడంతో.. సౌదీ అరేబియా ప్రస్తుతానికి ఎలాంటి తిరుగుబాటు దాడులకు దిగకుండా కాస్త నిగ్రహం పాటించింది. ఇరాక్ ప్రభుత్వం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. బాధ్యులైన వారిని పట్టుకునేందుకు ఇరాక్ భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా ఇరాన్తో ఉన్న "షలామ్చే" సరిహద్దును తాత్కాలికంగా మూసివేయడమే కాకుండా, విఫలమైన ఒక కీలక మిలిటరీ కమాండర్ను బాధ్యతల నుంచి తొలగించింది.
హోర్ముజ్ ఇబ్బందులతో పెరిగిన పైప్లైన్ ప్రాధాన్యం
1980ల కాలంలో నిర్మించిన ఈ ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ సౌదీకి అత్యంత వ్యూహాత్మకమైనది. పర్షియన్ గల్ఫ్ వైపు ఉండే ఆయిల్ క్షేత్రాల నుంచి ఎర్రసముద్ర తీరంలోని 'యాన్బు' పోర్ట్కు ముడిచమురును చేరవేయడానికి దీనిని వాడతారు. సాధారణంగా పర్షియన్ గల్ఫ్లో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అంతరాయం కలిగినప్పుడు, సౌదీ ఈ పైప్లైన్ ద్వారానే రోజుకు 40 నుంచి 50 లక్షల బారెళ్ల చమురును ఎగుమతి చేస్తుంది. ఇది ప్రపంచ మొత్తం చమురు సరఫరాలో దాదాపు 5 శాతానికి సమానం. యుద్ధం కారణంగా ఇప్పటికే హోర్ముజ్ మార్గం దెబ్బతినడంతో, సౌదీ అంతా ఈ పైప్లైన్పైనే ఆధారపడింది. ఇప్పుడు ఇదే మూతపడటంతో ప్రత్యామ్నాయాల అన్వేషణ కష్టంగా మారింది.
ఎర్రసముద్రంలో హౌతీల కబ్జా.. గ్లోబల్ మార్కెట్పై ప్రభావం
పైప్లైన్ మూసివేత ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ఎర్రసముద్రానికి ముఖద్వారంగా ఉండే బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలోని అత్యంత కీలకమైన "పెరిమ్ (మేయన్) ద్వీపాన్ని" యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించారు. అంతకుముందే వారు చారిత్రాత్మక మోచా పోర్ట్ నగరాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఎర్రసముద్రంలో హౌతీల ముప్పు పెరగడంతో చమురు నౌకలు దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫ్రికా ఖండాన్ని చుట్టి సుదీర్ఘ మార్గాల్లో వెళ్లాల్సి రావడం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్లు దాటగా, ఈ తాజా పరిణామాలతో ఇంధన సంక్షోభం మరింత ముదిరే అవకాశముంది.














Click it and Unblock the Notifications
