తీవ్ర సంక్షోభంలో ఆఫ్గనిస్తాన్-ఆకలితో అలమటిస్తున్న జనం-తిండి కోసం అన్నీ అమ్మేసుకుంటున్నారు
ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల రాజ్య స్థాపనతో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. నిన్న మొన్నటిదాకా ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు చేసినవారు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. ఉద్యోగ,ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కడుపు నింపుకునేందుకు ఇళ్లల్లో ఉన్న వస్తువులను అమ్ముకుంటున్నారు.టోలో న్యూస్ కథనం ప్రకారం... చాలామంది కాబూల్ వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను తీసుకొచ్చి అమ్మకానికి పెడుతున్నారు. ఎంతో కొంతకు వాటిని విక్రయిస్తున్నారు.ఆ పూటకు తిండి దొరికితే చాలు అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. వ్యాపారుల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. షాపుల్లో వస్తువులను కొనేవారు కరువవడంతో ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నా పిల్లలకు తిండి పెట్టాలంటే తప్పదు : ఓ షాపు యజమాని
లాల్ గుల్ అనే ఓ షాపు యజమాని మాట్లాడుతూ... 'నా షాపులో వస్తువులను సగం ధరం కన్నా తక్కువకే విక్రయించాను. 25ఆఫ్గనీలు పెట్టి కొన్న ఫ్రిజ్ను 5వేల ఆఫ్గనీలకే అమ్ముకోవాల్సి వచ్చింది. తప్పదు నా పిల్లలకు తిండి పెట్టాలి.' అని వాపోయాడు. కొంతమంది లక్ష ఆఫ్గనీల విలువ చేసే వస్తువులను సైతం కేవలం 20వేల ఆఫ్గనీలకు అమ్ముకున్నారు. ప్రస్తుతం కాబూల్ వీధుల్లో ఎక్కడ చూసినా... జనం ఫ్రిజ్లు,టీవీలు,సోఫాలు,కప్బోర్డులు,ఫర్నీచర్,ఇలా ఏదో ఒకటి విక్రయించేవాళ్లు కనిపిస్తున్నారు.
97శాతానికి పెరిగిన పేదరికం...
మాజీ పోలీస్ అధికారి మహమ్మద్ అఘా మాట్లాడుతూ... గత 10 రోజులుగా తానూ స్థానిక మార్కెట్లో వస్తువులను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్గన్ ప్రభుత్వం తనకు రావాల్సిన వేతనాన్ని చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఉన్నపళంగా ఉద్యోగం పోయి రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు.ఆఫ్గన్ పెను సంక్షోభం దిశగా వెళ్తున్నట్లు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. తాలిబన్లు అధికారంలోకి రాకముందు దేశంలో 72శాతంగా ఉన్న పేదరికం ఇప్పుడు 97శాతానికి పెరిగిందని ఐరాస పేర్కొంది. రాను రాను ఆహార సంక్షోభం తలెత్తుతుందని... ప్రజలు ఆకలి చావులతో చనిపోయే దుస్థితి తలెత్తవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలకే కాదు తాలిబన్ ఫైటర్లు కూడా వేతనాలు లేక,తిండి దొరక్క అలమటిస్తున్నారు.
అన్ని వైపుల నుంచి నిలిచిపోయిన నిధులు
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్),వరల్డ్ బ్యాంక్ ఇప్పటికే ఆఫ్గనిస్తాన్కు రుణాలు మంజూరు చేయడం నిలిపివేసింది.తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐఎంఎఫ్ ఈ ఆంక్షలు విధించింది.అటు అమెరికా ఆఫ్గనిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో 9.4బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసింది. తాలిబన్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 39 మంది సభ్య దేశాలను ఆదేశించింది.దీంతో తాలిబన్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది. అందుకే ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల నుంచి కేవలం 200డాలర్లను విత్డ్రా లిమిట్గా విధించింది.ఇప్పటికే పలు బ్యాంకులు మూతపడగా... కొన్ని బ్యాంకుల ముందు జనాలు భారీ ఎత్తున బారులు తీరి కనిపిస్తున్నారు.
మానవతా దృక్పథంతో స్పందించిన ఐరాస
ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆఫ్గన్ సంక్షోభ నివారణకు 1బిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ఐరాస ప్రకటించింది.తాలిబన్ల ఆశలన్నీ ఇప్పుడా నిధుల పైనే ఉన్నాయి. ఆ నిధులు తమకు అందితే పేద ఆఫ్గన్ ప్రజలను ఆదుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు.ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో పాటు ఐడీబీ నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ బ్యాంకులు తాలిబన్లకు నిధులు ఇవ్వడం అసాధ్యంగానే కనిపిస్తోంది.