పాకిస్తాన్ ప్రధానిగా ఆయనే: ఒకే ఇంట్లో ఇద్దరు ప్రధానులు: కీలక విదేశాంగ శాఖ భుట్టో చేతికి
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ వచ్చిన రాజకీయ సంక్షోభానికి తెర పడినట్టే. అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఉద్వాసనకు గురయ్యారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్ సందర్భంగా అధికార పక్షం తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 174 మంది ఓటు వేశారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది.

ఇమ్రాన్ ఖాన్ ఉద్వాసన..
ఇమ్రాన్ ఖాన్ ఉద్వాసనకు గురి కావడంతో ఇక కొత్త ప్రధానమంత్రి ఎవరనే విషయం చర్చనీయాంశమైంది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది? ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలను స్వీకరించనున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్.. పాకిస్తాన్కు కాబోయే కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అక్కడి మీడియా అంచనా వేసింది.

షెహబాజ్ షరీఫ్ను ఎన్నుకున్న ప్రతిపక్షాలు..
పాకిస్తాన్ మీడియా వేసిన అంచనాలు నిజం అయ్యాయి. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక అయ్యారు. ఈ మేరకు ఆయనే ఓ ట్వీట్ చేశారు. ప్రధాని అభ్యర్థిత్వానికి తన పేరును ఖరారు చేసినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆసిఫ్ జర్దారి, మౌలానా ఫజల్-వుర్-రెహ్మాన్, బిలావల్ భుట్టో, ఖలీద్ మక్బూల్, ఖలీద్ మగ్సీ, మోసిన్ దవర్, అలీ వజీర్, అమీర్ హైదర్ హోతి.. పాకిస్తాన్ పునర్నిర్మాణానికి పని చేశారని, వారికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నానని చెప్పారు.
రేపే ప్రమాణం..
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం షెడ్యూల్ చేశారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో ఉన్నారు. ఆయనకు కీలకమైన విదేశాంగ మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, మాజీ ప్రధానమంత్రి బెనజిర్ భుట్టో కుమారుడే ఈ బిలావల్ భుట్టో. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంలో కీలక పాత్ర పోషించారు.

ఒకే ఇంట్లో ఇద్దరు ప్రధానులు..
షెహబాజ్ షరీఫ్.. 70 సంవత్సరాల రాజకీయనేత. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు స్వయానా సోదరుడు. నవాజ్ షరీఫ్ ఇదివరకు మూడుసార్లు ప్రధానమంత్రిగా పని చేశారు. ఇప్పుడాయన తమ్ముడు కూడా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోన్నారు. పనామా పేపర్స్ కుంభకోణం ఆరోపణలతో ఆయన అరెస్టయిన తరువాత ఆ స్థానాన్ని షెహబాజ్ షరీఫ్ భర్తీ చేశారు. ఇదివరకు పంజాబ్ ప్రావిన్స్కు ముఖ్యమంత్రిగా పని చేశారు.

అనంత్నాగ్ టు పాక్..
నిజానికి- షెహబాజ్ పూర్వీకులది జమ్మూ కాశ్మీర్. అనంత్నాగ్ వారి స్వస్థలం. వ్యాపార కార్యకలాపాల కోసం అనంత్నాగ్ నుంచి పంజాబ్ అమృత్సర్ సమీపంలోని జటీ ఉమ్రా పట్టణానికి తరలి వెళ్లింది ఆయన కుటుంబం. అక్కడే స్థిరపడింది. దేశ విభజన అనంతరం ఈ ప్రాంతం మొత్తం పాకిస్తాన్లో విలీనమైంది. లాహోర్కు సమీపంలో ఉంటుందీ జటీ ఉమ్రా. ఇప్పటికీ షరీఫ్ బంధువులు ఇక్కడే నివసిస్తోన్నారు. ఒకే కుటుంబం నుంచి తొలుత నవాజ్ షరీఫ్.. తాజాగా షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్కు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications