సింహాలగడ్డ పంజ్షీర్ను తాలిబన్లు ఆక్రమించేశారా-ఆ ప్రకటనలో నిజమెంత-ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది
సింహాలగడ్డ పంజ్షీర్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందా... పంజ్షీర్ యోధులను తాలిబన్లు చిత్తు చేశారా... ప్రస్తుతం పంజ్షీర్లో నెలకొన్న పరిస్థితేంటి... ఈ ప్రశ్నలకు కచ్చితమైన,స్పష్టమైన సమాధానాలు దొరకట్లేదు. తాలిబన్లు మాత్రం పంజ్షీర్ను జయించామని... ప్రస్తుతం ఆ ప్రావిన్స్ తమ ఆధీనంలోనే ఉందని ప్రకటించుకున్నారు. మరోవైపు ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఆ ప్రకటనను ఖండించారు. తాలిబన్లతో పంజ్షీర్ తిరుగుబాటు దళం ఇంకా యుద్ధం చేస్తోందని... పంజ్షీర్ తాలిబన్ ఆధీనంలోకి వెళ్లిందన్న వార్తల్లో నిజం లేదని అన్నారు.

అల్లా దయతో అంతా మా ఆధీనంలోకి : తాలిబన్ ప్రకటన
'అల్లా దయతో ఆఫ్గనిస్తాన్ మొత్తాన్ని మా ఆధీనంలోకి తెచ్చుకున్నాం.పంజ్షీర్లో తిరుగుబాటుదారులను ఓడించాం. ప్రస్తుతం ఆ ప్రావిన్స్ మా కమాండ్లోనే ఉంది.' అని తాలిబన్ కమాండర్ ఒకరు వెల్లడించారు. ఈ ప్రకటనను ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఖండించారు.'సందేహం అక్కర్లేదు... మేమిప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం.తాలిబన్ల దండయాత్ర కొనసాగుతోంది.అయితే మేము ఈ నేలను పట్టుకుని పోరాడుతున్నాం.' అని వెల్లడించారు. ప్రస్తుతం తమ పోరాటం కొనసాగుతోందని... అది కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. 'నేనిప్పుడు నా దేశం కోసం నిలబడుతున్నాను... దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను' అని పేర్కొన్నారు. ఈ మేరకు బీబీసీ న్యూస్కు ఆయన ఓ వీడియో సందేశం పంపించారు.

దృష్టి మరల్చేందుకే తాలిబన్ ప్రకటన
అమృల్లా సలేహ్ తనయుడు ఎబదుల్లా సలేహ్ కూడా తాలిబన్ల ప్రకటనను ఖండించారు. తాలిబన్లు పంజ్షీర్ను జయింలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆఫ్గనిస్తాన్ జాతీయ తిరుగుబాటు దళం-విదేశీ వ్యవహారాల చీఫ్ అలీ నజరీ సైతం తాలిబన్ల ప్రకటనను ఖండించారు. తాలిబన్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.తాలిబన్లు పంజ్షీర్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారని... ఇలాంటి తరుణంలో అందరి దృష్టిని మరల్చేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తద్వారా ఆఫ్గనిస్తాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. పంజ్షీర్లోని తిరుగుబాటు దళ నాయకులతో తాను టచ్లో ఉన్నానని తెలిపారు.
Recommended Video

దేశం విడిచి పారిపోలేదు... అందులో నిజం లేదు... : అమృల్లా సలేహ్
పంజ్షీర్ నాయకుడు మసౌద్,ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఇద్దరూ దేశం విడిచి పారిపోయినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. అమృల్లా సలేహ్ ఆ వార్తలను ఖండించారు. తాము ఎక్కడికీ పారిపోలేదని... ఇప్పటికీ పంజ్షీర్ గడ్డ పైనే ఉన్నామని చెప్పారు. పంజ్షీర్ ప్రస్తుతం మసౌద్ నాయకత్వంలో తాలిబన్లతో పోరాడుతోంది. సుశిక్షితులైన 10వేల మంది పంజ్షీర్ యోధులు తాలిబన్లతో తలబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వందలాది మంది తాలిబన్లను పంజ్షీర్ దళం హతం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు తాలిబన్లు మాత్రం పంజ్షీర్పై పైచేయి సాధించామనే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అసలు పంజ్షీర్లో ఏం జరుగుతోందనే గందరగోళం నెలకొంది.

ప్రపంచం మమ్మల్ని పట్టించుకోవట్లేదు : ఆఫ్గన్ అధికారి
పంజ్షీర్లో తాలిబన్లకు అల్ ఖైదా కూడా తోడైందని నజరీ అలీ పేర్కొన్నారు. ఇరువురినీ తాలిబన్ తిరుగుబాటు దళం ఒంటరిగానే ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రపంచం తమను వదిలేసిందని... బయటి నుంచి ఏ రూపంలోనూ తమకు ఎలాంటి మద్దతు దొరకట్లేదని వాపోయారు. అంతర్జాతీయ ఉగ్రవాదంతో పోరాడుతున్న తమకు మద్దతు లేకపోవడం విచారకరమని అన్నారు. ఆఫ్గనిస్తాన్లో ఇప్పటికీ మెజారిటీ ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు. తాలిబన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు,రాజకీయ శక్తులకు,మహిళలకు చోటు కల్పించాలని అన్నారు. దురదృష్టవశాత్తు జనాభాలో సగ భాగమైన మహిళలను వారు పట్టించుకోవట్లేదని అన్నారు.

మహిళల నిరసనలు...
కరువుతో కుప్పకూలిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం... దేశంలో గత రెండు దశాబ్దాలుగా కమ్ముకున్న యుద్ధ మేఘాలను లేకుండా చేయడం.. ప్రస్తుతం తాలిబన్ల ముందున్న సవాళ్లు.మరోవైపు తాలిబన్ల పాలనలో మహిళా హక్కులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. 1996-2001 వరకు సాగిన గత తాలిబన్ల పాలనలో స్త్రీలకు హక్కులే లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనను అక్కడి మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 3) కాబూల్లోని అధ్యక్ష భవనం వద్ద పదుల సంఖ్యలో మహిళలు నిరసనకు దిగారు. మహిళల ప్రాతినిధ్యం లేని ఏ సమాజం అభివృద్ది చెందదని... మహిళలను పక్కనపెట్టడమంటే మానవతా దృక్పథాన్ని విడనాడటమేనని వారు వాపోయారు.ఆఫ్గన్లో అమెరికా నాటో దళాలకు సహకరించిన సిబ్బంది,స్త్రీల హక్కుల కోసం పోరాడిన సామాజిక కార్యకర్తలు,స్త్రీలపై ఆకృత్యాలకు పాల్పడినవారిని జైలుకు పంపించిన న్యాయవాదులు,మాజీ సైనికులు ప్రస్తుతం తీవ్ర అభద్రతలో ఉన్నారు. తాలిబన్లు తమను వెంటాడి చంపేస్తారనే భయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓవైపు తాము ఎవరితో శత్రుత్వం కోరుకోవట్లేదని... కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతుండగా... మరోవైపు ఆఫ్గన్లో ఇంటింటికీ తిరుగుతూ తాలిబన్లు అరాచకాలకు పాల్పడుతున్నారనే కథనాలు కలకలం రేపుతున్నాయి.

తాలిబన్ ప్రభుత్వం ఎలా ఉండనుంది...
తాలిబన్ ప్రభుత్వం ఇక రేపో మాపో కొలువుదీరే అవకాశం ఉంది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది.బరాదర్,దివంగత తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా మహమ్మద్ యాకూబ్,షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జయ్లు ప్రభుత్వంలో టాప్ 3 స్థానాల్లో ఉండనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇప్పటికే వీరు ఖతర్ నుంచి కాబూల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ ప్రభుత్వంతో మతపరమైన అంశాలను హైబతుల్లా అఖుద్జాదా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. మొత్తం 25 మంత్రిత్వ శాఖలతో ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు చెబుతున్నారు.ప్రభుత్వ ఏర్పాటు తర్వాత 5 నుంచి 8 నెలల్లో గ్రాండ్ అసెంబ్లీని ఏర్పాటు చేసి ఆఫ్గన్ సమాజంలోని అన్ని వర్గాల,గ్రూపుల ప్రతినిధులను ఆహ్వానించాలని తాలిబన్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్గనిస్తాన్ రాజ్యాంగ నిర్మాణానికి అవసరమైన సలహాలు,సూచనలు వారి నుంచి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications