టాటా సన్స్కు షాక్: రూ. 7వేల కోట్లు చెల్లించాలని కోర్టు
టొక్కో: భారత పారిశ్రామిక, సేవల దిగ్గజం టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జపాన్కు చెందిన టెలికాం కంపెనీ నిప్పన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్టీటీ) డొకోమో వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల బారీ జరిమానా విధించింది లండన్ కోర్టు.
1.17 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 7,943వేల కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించింది. డొకొమోతో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ మొత్తాన్ని డొకొమోకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ టాటా సన్స్కు ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయాన్ని టాటా సన్స్ ప్రతినిధి కూడా ధృవీకరించారు. కోర్టు ఆదేశాలకు తమకు చేరాయని దీనిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. టాటా సన్స్ ఎల్లప్పుడూ చట్టానికనుగుణమైన పద్ధతిలో ఒప్పంద బాధ్యతలు నిర్వర్తించేందుకు కట్టుబడి ఉందని, దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేమన్నారు.
కాగా టాటా టెలిలో తనకున్న 26.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా సంయుక్త భాగస్వామ్యం నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు 2014 ఏప్రిల్లో డొకోమో ప్రకటించింది. ఈ వాటాలను రూ.7,250 కోట్లకు కొనుగోలు చేసేందుకు తొలుత అంగీకరించిన టాటా సన్స్ ఆ తరువాత వెనుకడుగు వేసింది.
టాటా సన్స్తో కలసి తాము ఏర్పాటు చేసిన టాటా టెలి సర్వీసెస్లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్లోని కోర్టులో 2015, జనవరి 5న పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో టాటా సన్స్ ఏ విధంగా ముందడుగు వేస్తుందో వేచిచూడాలి.