ఉగ్రవాదుల కేరాఫ్ పాకిస్థాన్లో పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి; 10మంది పోలీసులు మృతి!!
పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్థాన్ దేశంలో తాజాగా వరుసగా జరుగుతున్న ఘటనలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలని ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులను పెంచి పోషించి పక్క దేశాల మీదకి ఉసిగొల్పడం ఎంతోకాలంగా కొనసాగుతుంది.
అయితే తాజాగా ఉగ్రవాదులు పాకిస్థాన్ లోని పోలీస్ స్టేషన్ పైన విరుచుకుపడడం పదిమంది పోలీసులను పొట్టన పెట్టుకోవడం షాక్ కు గురి చేసింది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఉత్తర పాకిస్థాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా చౌద్వాన్ పోలీస్ స్టేషన్పై ఫిబ్రవరి 5వ తేదీ( నేడు ) తెల్లవారుజామున ఉగ్రదాడి జరిగింది.

ఈ ఘటనలో 10మంది పోలీసు సిబ్బంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. చౌద్వాన్ పోలీస్ స్టేషన్న్ ను చుట్టుముట్టిన 30మందికి పైగా ఉగ్రవాదులు సుమారు రెండున్నర గంటలకు పైగా కాల్పులతో విరుచుకుపడ్డారు. మొదట గ్రనేడ్లతో దాడి చేసి ఆపై పోలీస్ భవనంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
పాకిస్థాన్ దేశంలో ఎన్నికలకు ముందు ఉగ్రవాదులు విరుచుకుపడుతున్న తీరుతో స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక నేడు జరిగిన దాడిలో పదిమంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాల పాలై చికిత్స పొందుతున్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసు చీఫ్ అక్తర్ హయత్ వెల్లడించారు.ఈ దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.
గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్తాన్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇలా ఉగ్ర దాడులు జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications