గుహలో 13మంది: ఎక్కడున్నారు, ఎలా.. కాపాడేందుకు నిపుణుల తలబద్దలు!
బ్యాంకాక్: థాయ్లాండ్లోని గుహలో చిక్కుకున్న సాకర్ బృందంలోని 12 మంది పిల్లల్ని, కోచ్ను రక్షించే చర్యలు ప్రారంభమయ్యాయి. జూన్ 23 నుంచి థామ్ లూవాంగ్ గుహలో భారీ వర్షాలు, వరదల కారణంగా నీరు చేరింది. మూడు కిలోమీటర్లకు పైగా దూరంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు వచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. వర్షాలు కురిసే అవకాశముందనే ఆందోళనల మధ్య రక్షణ చర్యలు ప్రారంభించింది. నేటి నుంచి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉంది.
మన కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మొదటి బాలుడ్ని తీసుకు వచ్చే అవకాశముంది. ఒకరిని గుహలోపలి నుంచి తీసుకు వచ్చేందుకు పదకొండు గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. పిల్లల సమాచారాన్ని కవర్ చేస్తున్న దాదాపు 100 మంది జర్నలిస్టులను గుహ ప్రధాన ద్వారం వద్ద నుంచి ఖాళీ చేయించారు.

4 నెలల సమయం పడుతుందని అంతకుముందు చెప్పారు
వారిని బయటకు తీసుకురావడం అంత సులభం కాదని కనీసం నాలుగు నెలలు పడుతుందని అంతకుముందు చెప్పారు. కానీ, వర్షాలకు భారీ స్థాయిలో వరద నీరు వెల్లువెత్తే ప్రమాదముందని తెలియడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గుహలోకి నీరు చేరకుండా చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే గుహలో వారు కూర్చున్న భాగం 10 మీటర్లకు కుచించుకు పోయినట్లుగా గుర్తించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇప్పుడు వారిని బయటకు తీసుకు వచ్చేందుకు మూడు నుంచి నాలుగు రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే?
ఆ గుహ పది కిలోమీటర్ల పొడవు ఉంటుంది. లోపలకు ప్రవేశించారంటే తిరిగి రావడం చాలా కష్టం. అలాంటి గుహను చూడాలని లోపలకు వెళ్లి చిక్కుకుపోయారు. వెళ్లిన వారంతా 11 నుంచి 16 ఏళ్ల వయస్సుగల వారు. కోచ్ వయస్సు 25 ఏళ్లు. గుహను చూస్తు రెండు కిలోమీటర్లు దాటారు. ఇంతలో వర్షం వచ్చింది. భారీ వర్షం రావడంతో గుహ లోపలకు నీరు వచ్చింది. దీంతో వారు మూడు కిలోమీటర్ల దూరానికి వెళ్లారు. వారు వెళ్లిన దారి మూసుకుపోయింది. తొమ్మిది రోజుల క్రితం అంటే గత నెల 23న చిక్కుకుపోయారు. వారిని బ్రిటిష్ గజ ఈతగాళ్లు గుర్తించారు.

బయటకు ఎందుకు రాలేకపోతున్నారంటే?
వారిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. వారు గుహలోకి వెళ్లినప్పుడు నీటి మట్టం తక్కువగా ఉంది. వారు లోనికి వెళ్లాక వర్షం కురవడంతో బయటకు రాలేకపోయారు. వెనక్కి వచ్చే దారిలో ఇసుక, బురద, రాళ్ల కారణంగా దారులు మూసుకుపోయాయి. వరద ఉధృతి తగ్గాలంటే నాలుగు నెలల సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. అయితే వారిని త్వరగా తీసుకు వచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తూనే ఉన్నారు.

13మందికి ఈత రాదు
గుహలోకి వెళ్లిన వారు తిరిగి రావాలంటే మొదట వారికి ఈత వచ్చి ఉండాలి. లేదా డైవర్లతో తీసుకు రావాలి లేదా నీటిని తోడేయాలి. కానీ ఈ రెండు కుదరలేదు. వారికి ఈతరాదు. చాలాదూరం ఈదాల్సి ఉంటుంది. గజ ఈతగాడికి కూడా గంటల సమయం పడుతుంది. అలాంటిది వారికి ఈత రాదు. గజ ఈతగాళ్లు కూడా తీసుకు వచ్చే పరిస్థితి లేదు. వారిని తీసుకు వచ్చే సమయంలో ఇద్దరికీ ప్రాణాపాయం సంభవించవచ్చు.

నీరు ఎంతగా తోడుతున్నా
నీటిని తోడేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు ఉన్న నీరు తోడేందుకే నెలలు పడుతుందని భావిస్తుండగా, వర్షాల కారణంగా ఎగువ నుంచి వచ్చే నీరు తోడవుతుంది. ఇన్ని రోజులుగా నీరు తోడుతున్నా గుహలో నీటి మట్టం అంతగా తగ్గింది ఏమాత్రం లేదు. డైవర్లు, ఆక్సిజన్ సిలిండర్లతో తీసుకు వచ్చే ఆలోచనలు కూడా చేశారు. కానీ వాటికి కూడా అంత అనుకూలంగా లేదు.

కొండపై నుంచి తవ్వే ఆలోచన కానీ
కొండపై నుంచి కిలో మీటరు లోతు తవ్వే ఆలోచనలు కూడా చేసారు. కానీ అదీ ప్రమాదమే. కొండచరియలు విరిగి, గుహ మొత్తం మూసుకుపోతే, పైగా కిలో మీటరు తవ్వడం త్వరగా సాధ్యమయ్యే పని కాదు. కొండపైకి భారీ యంత్రాలను తీసుకు పోవడం కూడా ప్రమాదకరమే.

వారికి తిండి, నీరు అందిస్తూ, ధైర్యం చెబుతూ
తొలుత వారు గుహలోకి వెళ్లిన పది రోజుల వరకు ఎవరికీ తెలియదు. దీంతో వారు వర్షపు నీటితో ప్రాణాలను నిలుపుకొని ఉంటారని భావిస్తున్నారు. వారి ఆచూకీ తెలిసిన తర్వాత ఆహారం, అవసరమైన ట్యాబ్లెట్లు అందిస్తున్నారు. అంతేకాదు, వారికి ఎప్పటికప్పుడు టైమ్ తెలిసేలా కూడా ఏర్పాట్లు చేశారు.

పైపుల ద్వారా ఆక్సిజన్
వారు ఉన్నచోట సరైన గాలి, వెలుతురు లేదు. దీంతో ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా ఉండటానికి నాలుగు కిలో మీటర్ల దూరం నుంచి పైపుల ద్వారా పంపించే ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు అమర్చే క్రమంలో శనివారం 38ఏళ్ల గజ ఈతగాడు, థాయిలాండ్ నావికాదళం మాజీ సీల్ సమన్ గునన్ ప్రాణాలు కోల్పోయాడు.

ఎన్నో ఆలోచనలు
దట్టమైన ఆ అడవి, ప్రమాదకరమైన గుహలో వారు ఎక్కడ ఉన్నది పై నుంచి కనిపెట్టడం చాలా రిస్క్. వారు కచ్చితంగా ఎక్కడ ఉన్నారో కనిపెట్టే సాంకేతికత లేదు. ఎక్కడ తవ్వితే ఎక్కడకు వెళ్తామో తెలియని పరిస్థితి. వారు ఉన్న చోటకు సమాంతరంగా మరో రంధ్రం చేసే ఆలోచనలు కూడా చేశారు. మరో అద్భుత ఆలోచన కూడా చేశారు. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. ఖనైలాన్ ట్యూబ్ సూచన చేశారు. మీటర్ వెడల్పాటి నైలాన్ ట్యూబును గుహలోకి తీసుకెళ్లి, దానిని గాలితో నింపి, అందులో నుంచి రక్షించాలనేది ప్లాన్. దీనిని కూడా నిపుణులు పరిశీలిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications