పండుగ పేరుతో కొన్నిరోజుల పాటు పస్తులు: అస్తిపంజరంలా మారిన ఏనుగు
కొలంబో: పండుగలు, పబ్బాల సమయంలో లేదా నిరాహార దీక్షల సమయంలో మనుషులు ఉపవాసం ఉంటారు. ఎంత కఠినంగా ఉపవాసం ఉన్నప్పటికీ.. ఒక్కరోజు కంటే ఎక్కువగా ఉండలేరు. మరుసటి రోజు తెల్లారే సరికి కడుపులో ఏదైనా పడాల్సిందే. లేదంటే- నీరసంతో నడవ లేని స్థితికి చేరుకుంటారు. నిరాహార దీక్షల సమయంలో ద్రవ పదార్థాలను తీసుకోవడం సర్వ సాధారణం. పండుగల పేరుతో మూగ జీవాలను కూడా పస్తులు ఉంచిన విషాదకర సంఘటన ఇది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 రోజుల పాటు పచ్చి నీరు కూడా అందకుండా చేయడం వల్ల ఓ భారీ ఏనుగు.. చిక్కి శల్యమైంది. అస్తిపంజరంలా తయారైంది. ఎన్ని కేజీల బరువునైనా తన వీపు వేసుకుని అవలీలగా మోసుకుంటూ వెళ్లే అంత భారీ ఏనుగు.. ఈ ఉపవాసం దెబ్బకు లేచి నిల్చునే సత్తాను కూడా కోల్పోయింది. మరణం అంచుల్లో నిల్చుంది. ఈ పరిస్థతిని గమనించిన సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ ప్రతినిధులు.. దానికి విముక్తి కల్పించారు. ఆహారాన్ని అందించారు.
బౌద్ధుల పండుగలో దారుణం..
ఈ ఘటన మన పొరుగునే ఉన్న శ్రీలంకలో చోటు చేసుకుంది. శ్రీలంకలోని క్యాండీలో ఏటేటా ఈసల పెరెహర అనే పండుగను నిర్వహిస్తారు. ఇది బౌద్ధుల పండగ. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఏనుగుల పండుగ. ఏనుగులను అందంగా అలంకరించి.. రాత్రంతా క్యాండీ నగరంలో తిప్పుతారు. ఏటా 10 రోజుల పాటు ఈ ఉత్సవం కొనసాగుతుంది. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. మొత్తం 60 ఏనుగులను ఉత్సవానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా టిక్రి అనే ఆడ ఏనుగును ఈ ఉత్సవాన్ని ప్రధాన ఏనుగుగా నిర్ధారించారు. స్థానిక ఆలయానికి చెందిన టిక్రి ఏనుగును పదిరోజుల పాటు తెల్లవారేంత వరకూ నగరం అంతా ఊరేగించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఉత్సవాన్ని నిర్వహవించారు. విజయవంతం చేశారు కూడా. రాత్రంతా ఏనుగు క్యాండీ వీధుల్లో తిరుగుతూ ఉంటే.. ప్రజలు దానికి పూజలు చేశారు.

చిక్కిశల్యమైన ఏనుగు..
ఈ సందర్భంగా ఆ ఆడఏనుగును ఉపవాస దీక్షలో ఉంచారు నిర్వాహకులు. ఫలితంగా- ఏనుగు చిక్కిశల్యమైంది. పదిరోజుల పాటు ఆహారం లేకుండా.. కునుకు లేకుండా.. రాత్రంతా క్యాండీ వీధుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడం వల్ల ఈ ఏనుగు శక్తి విహీనమైంది. లేచి నిల్చునే సత్తువ కూడా లేకుండా కుప్పకూలిపోయింది. టిక్రి పరిస్థితిని గమనించిన సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు.. ఈ ఏనుగు ఫొటోలను తీసి తమ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. అస్తిపంజరంలా మారిన ఏనుగు ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేశాయి. ఈ ఘటనపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లెక్ ఛైలెర్ట్ డిమాండ్ చేశారు. ఈ ఫొటోలను ఆయన శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘెకు షేర్ చేశారు. సంప్రదాయం పేరుతో ఇప్పటికకైనా మూగజీవాలను హింసించడానికి స్వస్తి పలకాలని అన్నారు. ఈ ఘటనపై శ్రీలంక పర్యాటక, వన్యప్రాణుల సంరక్షణ శాఖ మంత్రి జాన్ అమరతుంగ విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ నిర్వహించి, నివేదిక అందజేయాలని ఆయన అధికారులకు సూచించారు.













Click it and Unblock the Notifications