బ్రిటన్ను తాకిన బీబీసీ వ్యవహారం- కేంద్రం చర్యలపై నిశిత పరిశీలన ..!!
ప్రధాని మోదీపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీని నిషేధించిన తరువాత కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఐటీ సోదాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోన్నామని బ్రిటన్ వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బీబీసీ డాక్యుమెంటరీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు గడప కూడా తొక్కింది. డాక్యుమెంటరీ నిషేధం విషయంలో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు.

గుజరాత్ అల్లర్లపై..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ- గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ చోటు చేసుకున్న అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఇది. ఇండియా- ది మోదీ క్వశ్చన్ అనే టైటిల్ తో రూపుదిద్దుకున్న ఈ డాక్యుమెంటరీని దేశంలో ఎక్కడ కూడా దీన్ని ప్రదర్శించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి విరుద్ధంగా ఈ డాక్యుమెంటరీ ఉండటం వల్ల దీన్ని నిషేధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

ఐటీ దాడులతో కలకలం..
తాజాగా ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ కార్యాలయాలపై ఇవ్వాళ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా సోదాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఫోన్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ పన్నుల విధానంలో అక్రమాలు, బదిలీ ధరలలో అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ దాడులకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనిపై ఐటీ శాఖ ఇంకా ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు.

ఈ దాడుల పట్ల విమర్శలు..
బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడుల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్, తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రా, సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. కేంద్రం చర్యలను తప్పుపట్టారు. అదాని మోసాలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక కోసం ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తోంటే- నిజాన్ని వెలికి తీసిన బీబీసీని కేంద్ర ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు.

బ్రిటన్ స్పందన..
ఈ పరిణామాలన్నింటిపై బ్రిటన్ ప్రభుత్వం కూడా స్పందించింది. భారత్ లో బీబీసీ కార్యాలయాలపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులను నిశితంగా పరిశీలిస్తోన్నామని తెలిపింది. న్యూఢిల్లీ, ముంబైలల్లోని బీబీసీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్నట్లు తమకు రిపోర్టులు అందాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తోన్నామని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తిస్థాయి నివేదికలు అందిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తామని వివరించిది.












Click it and Unblock the Notifications