నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదు
అది సిటీలోనే ప్రముఖ ఆస్పత్రి. ప్రసూతి వైద్యానికి, నవజాత శిశువుల విభాగానికి పెట్టింది పేరు. నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు, రకరకాల ఇబ్బందులతో బాధపడే శిశువులు వచ్చి చేరుతుంటారక్కడికి. అలాంటి చోట పనిచేస్తోన్న ఓ నర్సు అతికిరాతకంగా వ్యవహరించింది. గుట్టుచప్పుడుకాకుండా పిల్లల్ని అంతంచేసింది.. ఒకటీ రెండూ కాదు, ఏకంగా ఎనిమిది మంది శిశువుల్ని చంపేసి, మరో 10 మంది ప్రాణాలు తీసేందుకు పథకం వేసింది.. అనుమానంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బండారం బయటపడింది. వివరాల్లోకి వెళితే..

30 ఏళ్ల నర్సు లూసీ..
వాయువ ఇంగ్లాండ్ లోని ఛెస్టర్ సిటీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఛెస్టర్ కౌంటీ ఆస్పత్రిలో ‘2015 జూన్ - 2016 జూన్' మధ్యకాలంలో చోటుచేసుకున్న నవజాత శిశువుల మరణాలు యూకే చరిత్రలోనే ఒకానొక భారీ విషాదకర సంఘటనగా నిలిచిపోయింది. ఆ సమయంలో సదరు ఆస్పత్రిలోని నియోనటెల్ వార్డులో నర్సుగా పనిచేసిన లూసీ లెట్బీ(30)నే ఎనిమిది మంది శిశువుల్ని హత్య చేసిందని, మరో 10 మందిని అంతం చేయాలనుకుందని చెస్టర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పొందిన ఆమెను, పోలీసులు మూడో దఫా రెస్టు చేసి, బుధవారం చెస్టర్ ‘క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్' కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా..

మూడేళ్లుగా దర్యాప్తు..
కోర్టు విచారణలో నర్సు లూసీ తన పేరు, పుట్టిన తేదీ ధృవీకరణకు తప్ప అసలు నోరెత్తలేదు. మూడేళ్లుగా నిత్యం వార్తల్లో ఉంటోన్న ఈ కేసుకు సంబంధించి లూసిని అరెస్టు చేయడం ఇది మూడో సారి. 2015-16 మధ్య కాలంలో చెస్టర్ ఆస్పత్రిలో నవజాత శిశువుల మరణాలు అనూహ్యంగా పెరగడంతో ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆస్పత్రి అంతర్గత దర్యాప్తులోనూ శిశువుల అసహజ మరణాలకు నర్సు లూసీనే కారణమని వెల్లడైంది. దీంతో 2017లో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2019లో మరోసారి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరిగా మంగళవారం(నవంబర్ 10న) మూడోసారి అరెస్టు చేసిన పోలీసులు.. తాము సేకరించిన ఆధారాలను కోర్టు ముందుంచారు. ఎనిమిది మంది శిశువుల్ని చంపడంతోపాటు మరో 10 మందిని హత్య చేసేందుకు ప్రయత్నించిందని లూసీపై ఆరోపణలు మోపారు. కానీ హతకురాలు ఆమెనే..

మిస్టరీ మరణాలు.. చంపింది ఆమెనే..
ఛెస్టర్ ఆస్పత్రిలో 2015-16 మధ్య కాలంలో శిశువులు ఆశ్చర్యకర రీతిలో ఊపిరితిత్తులు, గుండె వైఫల్యంతో చనిపోయినట్టు ఆసుపత్రి వర్గాలు గుర్తించయని, మరణించిన శిశువుల చేతులు, కాళ్లపై అసాధారణంగా మచ్చలు ఏర్పడ్డట్లు రిపోర్టుల్లో పేర్కొన్నారు. అయితే నర్సు లూసీ.. ఈ హత్యలు ఎలా చేసింది? ఏవైనా ప్రమాదకర ఇంజెక్షన్లను వాడిందా? మరో పద్ధతిని ఎంచుకుందా? అనే కీలక విషయాలను మాత్రం పోలీసులు ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయారు. కానీ హత్యలకు ఆమెనే కారణం అనడానికి మాత్రం తమ దగ్గర ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు..

చీమకు కూడా హాని తలపెట్టదు..
చెస్టర్ ఊళ్లోనే పుట్టిపెరిగిన లూసీ లెట్బీ.. చెస్టర్ యూనివర్సిటీలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, తనకెంతో ఇష్టమైన వైద్య వృత్తిలోకి ప్రవేశించింది. 2017లో ఆమెపై తొలిసారి కేసు నమోదైనప్పుడు ఆస్పత్రి వర్గాలు, ఆమె కుటుంబీకులు, తెలిసినవాళ్లంతా షాక్ కు గురయ్యారని లూసీ స్నేహితురాలు ఒకరు తెలిపారు. ‘‘లూసీ ఎంత దయతో నడుచుకుంటుందో ఆమెతో పరిచయం ఉన్నవాళ్లందరికీ తెలుసు. కనీసం చీమకు కూడా హాని తలపెట్టని హృదయం తనది. ఎంతో ఇష్టంతోనే ఈ వృత్తిని ఎంచుకుంది. అలాంటిది ఎనిమిది మంది శిశువుల్ని చంపేసిందంటే నమ్మశక్యంగా లేదు''అని లూసీ స్నేహితురాలు చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచీ లూసీని, ఆమె కుటుంబాన్ని చూస్తున్నామని, ఆమె ఇలాంటి పని చేసి ఉండదని, ఏదో మతలబు జరిగి ఉండొచ్చని లూసీ ఇరుగుపొరుగు చెప్పిన మాటలను ‘డెయిలీ మెయిల్' కథనంలో రాశారు. కోర్టుకు చేరిన ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచిచూడాలి..












Click it and Unblock the Notifications