మోడీతో మాట్లాడండి..ఒప్పించండి: మీ విద్యార్థులను మేం చదివిస్తున్నాం: ఉక్రెయిన్ కీలక సూచన
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. యుద్ధం నుంచి ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ.. రష్యా తన దాడుల తీవ్రతను మరింత పెంచుతూనే ఉంది. ఈ వారం రోజుల వ్యవధిలో 500 మిస్సైళ్లను రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్లోని పలు నగరాలపై సంధించినట్లు కీవ్ ఇండిపెండెంట్ వెల్లడించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాదాపుగా పట్టు బిగించినట్టే కనిపిస్తోంది.

పలు నగరాలపై..
ఇప్పటికే ఖేర్సన్, మెలిటొపొల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ అడ్డుకుంటోంది. ఖార్కీవ్లో అదే పరిస్థితి నెలకొంది. ఛెర్నిహివ్, మరియోపొల్ నగరాలను రష్యన్ సైనిక బలగాలు చుట్టుముట్టాయి. ఏ క్షణమైనా ఛెర్నిహివ్.. రష్యా వశం కావచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్పై రష్యా వైమానిక బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి.

భారత్ సహకారం..
ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించిన మాట్లాడారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత్, చైనా, నైజీరియా వంటి దేశాల పేర్లను ప్రస్తావించారు. ఆయా దేశాలతో తమకు ఉన్న అనుబంధాన్ని, దౌత్య సంబంధాలను గుర్తు చేశారు. యుద్ధాన్ని నివారించడానికి ఆయా దేశాలన్నీ తమవంతు ప్రయత్నాలు సాగించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాము రష్యాతో ఎందుకు యుద్ధాన్ని చేయాల్సి వస్తోందో వివరించారు.

భారత్తో సత్సంబంధాలు..
భారత్తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని దిమిత్రో అన్నారు. తమ దేశం నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలను భారత్కు ఎగుమతి చేస్తోన్నామని చెప్పారు. యుద్ధం ఇలాగే కొనసాగితే- విత్తనాలను సరఫరా చేయడం కష్టతరమౌతుందని స్పష్టం చేశారు. భారత్తో పాటు ప్రపంచ దేశాల ఆహార భధ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధాన్ని నివారించడానికి తమవంతు ప్రయత్నాలు చేయాలని సూచించారు.

భారత ప్రజలు స్పందించాలి..
సాధారణ భారత పౌరులు కూడా యుద్ధాన్ని వ్యతిరేకించాలని దిమిత్రో పిలుపునిచ్చారు. తమదేశంలోని రష్యా రాయబార కార్యాలయంపై ఈ మేరకు ఒత్తిళ్లను తీసుకుని రావాలని భారత పౌరులకు విజ్ఞప్తి చేశారు. 30 సంవత్సరాలుగా భారత్ సహా ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులు తమ వద్ద చదువుకుంటున్నారని, వారికి అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తున్నామని చెప్పారు. యుద్ధం వచ్చినప్పుడు వారి కోసం రైళ్లు, హాట్లైన్లను ఏర్పాటు చేశామని, ఆయా దేశాల రాయబార కార్యాలయాతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.

మోడీతో మాట్లాడండి..
భారత్తో దౌత్య సంబంధాలను కలిగివున్న దేశాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడాలని, యుద్ధాన్ని నిలిపివేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడేలా మోడీని ఒప్పించాలని దిమిత్రో అన్నారు. తాము మోడీని తరచూ సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. హ్యూమనైటేరియన్ కారిడార్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి సానుభూతిని పొందాలని రష్యా ప్రయత్నిస్తోందని, అది సాధ్యపడదని దిమిత్రో చెప్పారు.












Click it and Unblock the Notifications