ఇప్పుడు జాగ్రత్తపడకపోతే ఆకలి చావులు తప్పవు: ఐక్యరాజ్యసమితి వార్నింగ్
ఐక్యరాజ్యసమితి: కరోనావైరస్ ప్రపంచదేశాలను కబళిస్తున్న నేపథ్యంలో ఆహార భద్రత లేకుండా ఉన్న వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తెలిపింది. ఈ సారి ఈ సంఖ్య రెట్టింపై 265 మిలియన్కు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక కరోనా వైరస్తో కుదేలైన పర్యాటక రంగం తద్వారా రెవిన్యూ కోల్పోవడం, పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు దాదాపు 130 మిలియన్ మందికి ఆహార కొరత ఏర్పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

కొరవడనున్న ఆహారభద్రత
కోవిడ్-19 అనుకోని విపత్తుగా ఏర్పడిందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చీఫ్ ఎకానమిస్ట్ మరియు రీసెర్చ్ డైరెక్టర్ ఆరిఫ్ హుస్సేన్ చెప్పారు. ఈ కష్ట సమయాల్లో ప్రపంచదేశాలు ఒక్క తాటిపైకి వచ్చి పనిచేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరిఫ్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఆహారం కొరతతో చాలా ఆకలి చావులు చూడాల్సి వస్తుందని అదే సమయంలో జీవనోపాధి కూడా లేకుండా పోతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే చాలామంది ఆహారం దొరక్క ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారని చెప్పిన ఆరిఫ్... ఇప్పుడు కనుక చర్యలు తీసుకోకపోతే వారు నిలదొక్కుకునేందుకు చాలా సమయం పడుతుందని వెల్లడించారు. ఉదాహరణకు ఒక రైతు తన వ్యవసాయ సామగ్రిని, ఎడ్లను అమ్ముకుంటే భవిష్యత్తులో ఆహార ఉత్పత్తికి ప్రధాన మూలంగా నిలిచే పంటలు ఆగిపోతాయని చెప్పారు. కోవిడ్-19కు ముందు వీరంతా బాగుండేవారని కోవిడ్-19 తర్వాత వీరి పరిస్థితి దుర్బరంగా మారిందని ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకురావాలని దేశాలకు పిలుపునిచ్చారు.

ఆఫ్రికా దేశాల్లోనే తీవ్ర ఆహార కొరత
ఇక తక్కువ స్థాయిలో ఆహార భద్రత లేదా జీవనోపాధి సంక్షోభం ఐక్యరాజ్య సమితి సూచించిన ఐదు సంక్షోభ దశల్లో మూడవదిగా ఉందని గుర్తుచేశారు ఆరిఫ్. ఐదవ కేటగిరీ అంటే ఆకలితో అలమటించడం అని చెప్పారు ఆరిఫ్. ఇప్పటికైతే ఏయే దేశాలకు అవసరాలు పెరిగపోతున్నాయో అన్న అంశంపై ఐక్యరాజ్యసమితి క్లారిటీ ఇవ్వలేదని అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం ఆఫ్రికాదేశాలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తాయని ఆరిఫ్ అంచనా వేశారు. గతేడాది కంటే ఈ ఏడాది నిధులను 10 బిలియన్ డాలర్ల నుంచి 12 బిలియన్ డాలర్లకు ఆహార భద్రత కోసం పెంచాల్సిన అవసరం ఉందని ఆరిఫ్ చెప్పారు.
Recommended Video

ఆహార కొరతతో బాధపడుతున్న 55దేశాల్లోని 135 మంది మిలియన్ ప్రజలు
ఇదిలా ఉంటే మంగళవారం విడుదలైన నాల్గవ వార్షిక రిపోర్టు ప్రకారం ఇప్పటికే ఆహార భద్రత కొరత దిశగా వెళుతోందని తెలుస్తోంది. 55 దేశాల్లో 135 మిలియన్ మంది ప్రజలు సరైన ఆహారం లేక అల్లాడిపోతున్నారని నివేదిక వెల్లడించింది. ఇక రానున్న నాలుగేళ్లలో మరో 20 మిలియన్ మంది ఈ కోవలోకి చేరుతారని అంచనా వేసింది. ఇక 50 దేశాలను గతేడాది ఈ ఏడాదితో పోలిస్తే 10శాతం మంది అంటే 123 మిలియన్ మంది ఆహార కొరతతో ఉన్నారని నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, కరువు వల్ల ఏర్పడిందని నివేదిక స్పష్టం చేసింది. యెమెన్, దక్షిణ సూడాన్లాంటి దేశాల్లో ఇప్పటికే యుద్ధం వల్ల ఆదేశాల్లోని సగం జనాభాకు పైగా ఆహార కొరతతో బాధపడుతున్నారని ఉదహరించింది నివేదిక.
మొత్తానికి కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచదేశాలు ఒక్కతాటిపైకొచ్చి సమస్యకు పరిష్కారం కనుగొనకపోతే భవిష్యత్తులో తీవ్రపరిణామాలు తప్పవని ఆరిఫ్ హుస్సేన్ చెబుతున్నారు. ఆయా దేశాల్లో ప్రయాణ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇది మరింత క్లిష్టతరంగా మారుతుందని పేర్కొన్నారు. దీంతో రానున్న నెలల్లో ఆహారభద్రత లేకుండా పోతుందని ఆకలి చావులు దర్శనమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆరిఫ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications