వైట్హౌస్ మొత్తానికీ కరోనా అంటించిన ట్రంప్? అడ్వైజర్, ప్రెస్ సెక్రెటరీ, జర్నలిస్టులకు వైరస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్.. ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టలా తయారైనట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ ఈ వైరస్ బారిన పడిన తరువాత.. వరుసగా పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది వరకు సిబ్బందికి ఈ మహమ్మారి సోకింది. వారికి నిర్వహించిన పరీక్షలు పాజటివ్గా తేలాయి. దీనితో క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.
Recommended Video
'డబుల్ థంబ్స్ అప్' చూపించారు సరే... పూర్తిగా కోలుకున్నట్లేనా.. ట్రంప్ డిశ్చార్జిపై ప్రశ్నలు...
ట్రంప్ అడ్వైజర్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోన్న వేళ.. చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కరోనా బారిన పడ్డారు. ట్రంప్కు కరోనా సోకిన తరువాత ఆయన ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. ఐసొలేషన్లో ఉంటున్నారు. అయిదు రోజులుగా తాను ఐసొలేషన్లో ఉంటూ వీడియో కాన్ఫరెన్సులు, ఆన్లైన్ ద్వారా విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. రోజూ కరోనా పరీక్షలను చేయించుకుంటున్నానని తెలిపారు.
వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీకి..
అయిదు రోజుల్లో మూడుసార్లు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, నెగెటివ్ రిపోర్టులు వచ్చాయని పేర్కొన్నారు. మరోసారి టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు స్టీఫెన్ చెప్పారు. ప్రస్తుతం తాను మరికొద్దిరోజుల పాటు క్వారంటైన్లో కొనసాగుతానని చెప్పారు. కొన్ని గంటల వ్యవధిలోనే వైట్హౌస్ ప్రెస్ కార్యదర్శి కేయిలె మెక్ఎనానీకి కరోనా వైరస్ సోకింది. దీనితో ఆయన క్వారంటైన్లో ఉంటున్నారు. మెక్ఎనానీకి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన పేషీలో పనిచేసే సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.
వైట్హౌస్లో డాక్టర్ల పర్యవేక్షణలో..
అక్కడితో ఆగలేదా కరోనా. వైట్హౌస్లో నిర్వహించే విలేకరుల సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే ముగ్గురు జర్నలిస్టులు కూడా దీని బారిన పడ్డారు. ప్రస్తుతం వారంతా క్వారంటైన్లో ఉంటున్నారని వైట్హౌస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కరోనా వైరస్ నుంచి కోలుకుని, డిశ్చార్జయిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం వైట్హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నారు. 48 గంటల పాటు ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగాల్సి ఉంటుందని వైట్హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
డాక్టర్ల పర్యవేక్షణలో..
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని, అయినప్పటికీ..ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాల్సి ఉన్నందున ముందుజాగ్రత్త చర్య కింద డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంటున్నారని పేర్కొంది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను ఆయన ధరిస్తున్నారని, మాస్కులను ధరిస్తున్నారని స్పష్టం చేసింది. కరోనా బారిన పడ్డ అనంతరం ట్రంప్.. మేరీల్యాండ్లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఆయన డిశ్చార్జి అయ్యారు.