అమెరికా ఎన్నికల్లో ఆంధ్రా మహిళ ఓటమి: ట్రంప్ పార్టీ నుంచి పోటీ చేసినా వ్యతిరేక ఫలితం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల హవా వీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు భారతీయులు విజయం సాధించారు. రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, డాక్టర్ అమీ బెరా, రో ఖన్నా వంటి నేతలు విజయం సాధించారు. తెలుగు మహిళ ఒకరు పరాజయాన్ని చవి చూశారు. ఆమె పేరు మంగ అనంతాత్ముల. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వర్జీనియా నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి గెర్రీ కొన్నొల్లీ చేతిలో ఓటమి పాలయ్యారు. గెర్రీకి 71.7 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మంగ అనంతాత్ములకు పడ్డ ఓట్ల శాతం 28.3 శాతం మాత్రమే.
అమెరికా రాజకీయాల్లో నూతన అధ్యాయం: తొలి అడుగు: హిజ్రా ఘనవిజయం: ఎవరామె?
ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వర్జీనియా నుంచి రిపబ్లికన్ తరపున పోటీచేస్తున్న తొలి ఇండో అమెరికన్గా గుర్తింపు పొందారు. వర్జీనియా డెమొక్రాట్లకు కంచుకోట. ఈ స్టేట్లో 17 శాతం ఆసియా దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అందులో ఏడుశాతం మందికిగా భారతీయులే. రాజకీయాల్లోకి రాకముందు మంగ డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రాంలో పని చేశారు. ఏపీలో జన్మించిన మంగా అనంతాత్ముల చెన్నైలో చదువుకున్నారు.
అనంతరం ఆగ్రా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1990లో భర్త, కుమారుడితో కలిసి అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. సాధారణంగా అమెరికాలో స్థిరపడ్డ ఆసియా దేశాల వారు ముఖ్యంగా భారతీయులు డెమొక్రాట్ అభ్యర్థులకే మద్దతుగా నిలుస్తారు.దీనికి భిన్నంగా ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరారు. వర్జీనియాపై పట్టు సాధించగలనని ధీమాతో ఉన్నప్పటికీ..అది వాస్తవారూపం దాల్చలేదు. ఎన్నికల ఫలితాలు ఆమెకు ప్రతికూలంగా వెలువడ్డాయి. డెమొక్రాట్ల అభ్యర్థి గెర్రీకి 2,71,400 ఓట్లు పోల్ అయ్యాయి. మంగకు 1,07,368 మంది ఓటు వేశారు. గెర్రీ ఈ స్థానాన్ని గెలవడం వరుసగా ఇది ఆరోసారి.