యుద్దం పక్కనపెట్టి షేక్ హ్యాండ్.. అమెరికా-తాలిబన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం..
అమెరికా-ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య శనివారం చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఖతర్లోని దోహా వేదికగా ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందం మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని తమ సేనలను 14 నెలల్లోగా ఉపసంహరించుకుంటామని అమెరికా తెలిపింది. 18 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యానికి,తాలిబన్లకు మధ్య జరుగుతున్న యుద్దానికి తెరదించి.. శాంతి చర్చలకు బీజం వేయాలన్నది ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.
ఆ వాగ్దానం మేరకే ఒప్పందం
దోహాలోని ఓ లగ్జరీ హాటల్లో జరిగిన శాంతి ఒప్పందానికి తాలిబన్ల తరుపున ముల్లా బరాదర్,అమెరికా తరుపున జల్మయ్ ఖలిజాద్ హాజరయ్యారు. సమావేశం ఆరంభంలో ఇరువురు ప్రతినిధులు కరచాలనం చేసుకోగా.. అక్కడున్నవారంతా 'అల్లాహు అక్బర్' అంటూ హర్షం వ్యక్తం చేశారు. అల్-ఖైదాతో సంబంధాలను తెంచుకుంటామన్న తాలిబన్లు.. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరిన తర్వాతే అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ ఈ ఒప్పందానికి అంగీకరించారు.
ఒప్పందంపై ట్రంప్..
ఒప్పందాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దీన్ని ఆఫ్ఘన్ ప్రజలు కొత్త భవిష్యత్తుకు అవకాశంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. తాలిబాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఈ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటే.. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధానికి తెరదించి తమ సేనలను వెనక్కి రప్పించడానికి మార్గం ఏర్పడుతుందని అన్నారు.
స్పందించిన నాటో సెక్రటరీ జనరల్
దోహాలో జరిగిన అమెరికా-తాలిబన్ ఒప్పందానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దూరంగా ఉంది. ఈ ఒప్పందంపై ఆఫ్ఘన్ ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. కాగా, శనివారం ఒప్పందం తర్వాత ఆఫ్ఘన్ నుంచి అమెరికా 8600 మంది సైనికులను వెనక్కి రప్పించనుంది. ఆ తర్వాత 14 నెలల్లో దశలవారీగా మొత్తం సైన్యాన్ని ఉపసంహరించుకోనుంది. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఈ ఒప్పందాన్ని శాశ్వత శాంతి స్థాపనకు మొదటి అడుగుగా అభివర్ణించారు.
అల్ఖైదా దాడుల తర్వాత..
సెప్టెంబర్ 11,2001లో అమెరికాపై అల్ఖైదా దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఏరివేతకు అమెరికా తమ సైన్యాన్ని మోహరించింది. అల్ఖైదాకు తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారన్న ప్రధాన కారణంతో ఈ చర్యకు పూనుకుంది. దాదాపు లక్ష కోట్లను ఖర్చు చేసింది. ఇప్పటివరకు తాలిబన్లకు,అమెరికన్ సేనలకు మధ్య జరిగిన యుద్దంలో ఎంతోమంది అమాయక ఆఫ్ఘన్ ప్రజలు హతమయ్యారు. తాజా ఒప్పందం నేపథ్యంలో శనివారం ఆఫ్ఘన్ వ్యాప్తంగా తమ సైనిక చర్యలన్నింటిని నిలిపివేసినట్టు తాలిబన్లు తెలిపారు. మొత్తం మీద శాంతి చర్చలకు ఒప్పందంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఒప్పందం ఎలా ముందుకు సాగుతుందన్నది వేచి చూడాలి.