గెలిస్తే మోడీతో పనిచేసేందుకు సిద్ధమే: అమెరికా
వాషింగ్టన్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పట్ల అగ్రరాజ్యం అమెరికా తన వైఖరి మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా వీసా కోసం నరేంద్ర మోడీ దరఖాస్తు చేసుకోవచ్చనే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చినట్లయితే నరేంద్ర మోడీతో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని ఆ దేశ పరిపాలన విభాగానికి చెందిన ఉన్నాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి గెలుపొందినట్లయితే మీ వైఖరి ఎలా ఉంటుందని అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో కలిసి పని చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అమెరికాకు చెందిన సీనియర్ అధికారి చెప్పారు. వీసా నిరాకరించడమనేది చిన్న విషయమని, దీన్ని మీడియానే అతి చేసిందని ఆయన తెలిపారు.
ఒక వేళ మోడీ వీసా దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పటివరకు నరేంద్ర మోడీ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేదని ఆ అధికారి తెలిపారు. మోడీ నాయకత్వంలోని బిజెపి అధికారంలోకి వస్తే అమెరికాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయా అని ప్రశ్నించగా.. గతంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ భారతదేశంతో దృఢమైన బంధాన్ని కొనసాగించామని గుర్తు చేశారు. భారతదేశంతో అమెరికాకు ఉన్న బంధం విడదీయలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. భారతదేశంలోని ప్రభుత్వం కూడా ఇందుకు సుముఖంగా ఉంటుందని కోరుకుంటున్నట్లు చెప్పారు. మోడీ గురించి అమెరికా ప్రభుత్వం ఉత్సుకత చూపడం లేదని, వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చినా తాము కలిసి పనిచేస్తామని మరో అధికారి వెల్లడించారు.