Viral Video : పోర్టులోనే మునిగిపోయిన భారీ ఓడ-కంటెయినర్ అన్ లోడ్ చేస్తుండగా...
ఈజిప్టుకు చెందిన సీ ఈగల్ అనే భారీ కార్గో నౌక టర్కీ పోర్టులో బోల్తా పడింది. టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్లో సరుకును అన్ లోడ్ చేసేందుకు వచ్చిన ఈ భారీ ఓడ హఠాత్తుగా మునిగిపోయింది. కంటెయినర్ల అన్ లోడింగ్ జరుగుతుండగానే ఈ ఓడ క్రమంగా మునిగిపోతుండటంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఓడలో సిబ్బంది సైతం టెన్షన్ పడ్డారు. చివరికి ఓడ మునిగిపోతుందని గుర్తించి చివరి క్షణాల్లో సిబ్బంది మాత్రం తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు.
సీ ఈగిల్ ఓడ పక్కకు ఒరుగుతూ మునిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.గత శనివారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్లో డాక్ చేసిన ఈ ఓడ బాక్సులను అన్లోడ్ చేసే ప్రక్రియ జరుగుతుండగా ఘటన జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నౌకను 1984లో నిర్మించారని స్ధానిక మీడియా తెలిపింది.
The 3120 DWT cargo ship, Sea Eagle, sailing under the Flag Of Togo, lost stability and sank on 17th September during the offloading of containers at Iskenderun Port.
— Hamzah Alsayed (Abu Yousuf) (@alsayed_ksa) September 19, 2022
However, when it rose partially above the waterline and began to lose stability, the crew left the ship safely. pic.twitter.com/Ok8kkudv6a
అకస్మాత్తుగా పక్కకు ఒరిగిపోవడం ప్రారంభించిన ఈ ఓడ త్వరగానే నీటిలో మునిగిపోయింది. దీంతో టర్కీ పోర్టు సిబ్బంది, సరుకును లోడ్ చేస్తున్న వ్యక్తులు షాక్ అయ్యారు. టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ టోగో ఫ్లాగ్ చేసిన ఓడ నుండి 24 కంటైనర్లు పోయాయని, చిన్న చమురు లీక్ కూడా జరిగినట్లు ట్విట్టర్లో ప్రకటించింది.
అదృష్టవశాత్తూ సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎటువంటి గాయాలు కూడా కాలేదని వెల్లడించింది. నౌక ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, దానిని మరమ్మత్తు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదని మరొక అవుట్లెట్ కెప్టెన్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని ఓడరేవు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓడలోని ఇంధనాన్ని ఆఫ్లోడ్ చేసి కంటైనర్ను వెలికితీసే ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది.