Sheikh Hasina.. ఎక్కడ తలదాచుకుంటున్నారు? భారత్ లో ఉన్నారా? లేక..!!
పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణ శిక్ష పడింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) కోర్టు తుది తీర్పు వెలువడించింది. 2024 జులై- ఆగస్టు మధ్య సంభవించిన హింసాత్మక నిరసనల ప్రదర్శనలకు ఆమెను బాధ్యురాలిగా గుర్తించింది న్యాయస్థానం. అప్పట్లో ఈ అల్లర్లల్లో 1,400 మందికి పైగా మరణించారు. వారందరి మరణానికీ షేక్ హసీనా బాధ్యురాలని తేల్చి చెప్పింది.
ఆ దేశ మాజీ హోం శాఖ మంత్రి అసదుజ్జామన్ ఖాన్ కమల్కు కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ ఉరిశిక్షను విధించింది. పదవిని నిలుపుకోవడానికి, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి షేక్ హసీనా, ఖాన్ కమల్.. నరమేధానికి పాల్పడినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఈ నేరాలకు ఇద్దరూ ప్రధాన సూత్రధారులుగా తేల్చింది. ఇదే నేరంతో ప్రమేయం ఉన్న మాజీ పోలీసు జనరల్ ఇన్స్పెక్టర్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్ కు అయిదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది.

షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లోనే తలదాచుకుంటోన్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగడం, ఆ తర్వాత ఉద్వాసనకు గురైన వెంటనే ఆమె భారత్ కు వచ్చారు. 2024 ఆగస్టు 5వ తేదీన అక్కడి సైనిక తిరుగుబాటు, ఉద్యమకారులను తప్పించుకుని సరిహద్దులను దాటారు. భారత్ లో అడుగు పెట్టారు. ఆమెకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. అప్పటి నుండి ఆమె ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పూర్తి రక్షణ కల్పించింది.
తన తల్లికి మరణ శిక్ష పడటం పట్ల షేక్ హసీనా కుమారుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు సజీబ్ వాజెద్ స్పందించారు. ఢాకాలో మాట్లాడారు. ఆమె ప్రస్తుతం భారత్ లో భద్రతా దళాల రక్షణలో సురక్షితంగా ఉన్నారని అన్నారు. అవామీ లీగ్కు ఇకపై గట్టి మద్దతు లభిస్తుందని, తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతాయని హెచ్చరించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అనిశ్చితిని సృష్టించడం ద్వారా పార్టీ ఎన్నికల నుండి నిషేధానికి గురైందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications