సంజీవ్, అన్షుగుప్తాలకు రామన్ మెగసెసె ప్రదానం
మనీలా: ప్రజావేగు, ప్రభుత్వ ఉన్నతాధికారి సంజీవ్ చతుర్వేది, స్వచ్ఛంద సంస్థ గూంజ్ వ్యవస్థాపకులు అన్షుగుప్తాలకు 2015 రామన్ మెగసెసే పురస్కారం ప్రదానం చేశారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వహించిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో సంజీవ్ మాట్లాడారు.
ఈ ప్రఖ్యాత పురస్కారం ఆసియాలో నిజాయతీకలిగిన ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో నైతిక స్త్థెర్యాన్ని పెంచుతుందన్నారు. భారతీయ యువత అవినీతి నిర్మూలనను, ప్రజాసేవలు, పాలనలో పారదర్శకత, సమానత్వాన్ని బలంగా కోరుకుంటోందన్నారు.
భారత అటవీ సర్వీసులకు చెందిన సంజీవ్ ఢిల్లీ ఎయిమ్స్లో ముఖ్య విజిలెన్స్ అధికారిగా అక్కడి కుంభకోణాలపై దర్యాప్తునకు చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్లో ఉపకార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఈ పురస్కారం అందుకున్న మరో వ్యక్తి అన్షుగుప్తా మాట్లాడుతూ.. తామీ ప్రపంచాన్నేమీ మార్చాలని కోరుకోవడం లేదనీ, ముందుగా మెరుగు పరచాలనుకుంటున్నామన్నారు. పేదరికం ప్రస్తుత అతిపెద్ద విపత్తు అన్నారు.
అభివృద్ధి అజెండాలు, విధానాలను మోపడం ఆపాలనీ, ఇలాంటి నిర్ణయాల ప్రభావానికి లోనయ్యే ప్రజల అభిప్రాయాలు వినాలన్నారు. అన్షుగుప్తా 1999లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని గూంజ్ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు.
కాగా, లావోస్కు చెందిన కొమ్మలి చాంథవాంగ్, ఫిలిప్పీన్స్కు చెందిన లిగయా ఫెర్నాండో -అమిల్బంగ్సా, మయన్మార్కు చెందిన క్యావ్థు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షులు బెనింగ్నో సిమియాన్ కోజుయాంగ్కో అక్వినో-3 విజేతలకు బంగారు పతకం, నగదు పురస్కారాన్ని అందజేశారు.