గొంతు నులిమి కన్న పిల్లలను చంపే యత్నం చేసిన తల్లి
వాషింగ్టన్: ఏడుస్తున్న పిల్లలను సముదాయించలేక కన్నతల్లే తన ముగ్గురు పిల్లలను హత్యచేయడానికి పూనుకుంది. అత్యంత దారుణమైన ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 28 ఏళ్ల క్రిస్టియానా బూత్, థామస్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఒకరికి రెండేళ్ల వయసు కాగా మరో కవలజంటకు ఆరు నెలలు.
తల్లి క్రిస్టియానా బూత్కు సెలవు ఉండటంతో ఇంట్లోనే ఉంది. పిల్లలు తమ సహజ చికాకుల వల్ల ఏడుపును అందుకున్నారు. పిల్లలను అనునయించి సముదాయించడానికి బదులు వారిపై ఆమె తన కర్కశత్వాన్ని ప్రదర్సించింది. పిల్లలు ఎంతకు ఏడుపు ఆపకపోయేసరికి వైద్య సహాయం నిమిత్తం ఫోన్ చేసింది. వారు ఇంటికి వచ్చే లోపే తన చికాకును ఏడుస్తున్న పిల్లలపై చూపించింది.
పిల్లల ఏడుపు ఆపే క్రమంలో అమానుషంగా ప్రవర్తిస్తూ చిన్నారుల గొంతు నులిమింది. సహాయక సిబ్బంది ఇంటికి చేరుకుని చూసే సరికి రక్తపు మరకలతో పిల్లలు ఏడుస్తూ కనిపించారు. తక్షణం స్పందించిన సిబ్బంది పిల్లలను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పిల్లలకు శస్త్రచికిత్స చేశారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. వారిని ప్రొటెక్టివ్ కస్టడీలో ఉంచారు. తల్లి ఒక రకమైన డిప్రెషన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాము రెండు పెద్ద గ్లాసుల వైన్ తీసుకున్నట్లు థామ్ బూత్ చెప్పాడు. తాము మత్తులో ఉన్నామని చెప్పాడు.