అమెరికా చేరిన చైనా అధినేత జిన్పింగ్: ఏం జరుగుతోంది?
వాషింగ్టన్: చైనా అధినేత గ్ఝి జిన్పింగ్ (Xi Jinping) అమెరికా పర్యటన ఆరంభమైంది. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడ పర్యటిస్తారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తో ముఖాముఖి భేటీ కానున్నారు. ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు (APEC Economic summit) కు హాజరవుతారు.
బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జిన్పింగ్.. కొద్దిసేపటి కిందటే అమెరికాలో అడుగుపెట్టారు. ఆ దేశ కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1:15 నిమిషాలకు శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసొమ్, ప్రథమ మహిళ జన్నిఫర్ సీబెల్ న్యూసొమ్, మేయర్ లండన్ బ్రీడ్ ఆయనకు స్వాగతం పలికారు.

అపెక్ ఆర్థిక సదస్సకు ఆతిథ్యాన్ని ఇస్తోంది శాన్ఫ్రాన్సిస్కో. బుధవారం సదస్సు ఆరంభమౌతుంది. 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో పాల్గొనడానికి జో బైడెన్ ఇదివరకే ఈ నగరానికి చేరుకున్నారు. అపెక్ సభ్యదేశాధినేతలు, ప్రధానమంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు.
అమెరికా, న్యూజిలాండ్, చైనా, ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, కొరియా, పెరు, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, బ్రూనై, హాంగ్ కాంగ్, వియత్నాం, మలేసియా, మెక్సికో, పపువా న్యూగినియా, కెనడా, చిలీ, చైనీస్ తైపే..దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. భారత్కు సభ్యత్వం లేదు.
తన అమెరికా పర్యటనలో భాగంగా జిన్పింగ్.. జో బైడెన్తో ముఖాముఖి భేటీ అవుతారు. ఇతర వాణిజ్య సదస్సులకూ హాజరవుతారు. కొంతమంది సెనెటర్లనూ కలుస్తారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై ప్రసంగిస్తారు.
గతంలో అమెరికా- చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. చైనాకు చెందిన కొన్ని యాప్స్.. అంతర్గత సమాచారాన్ని సంగ్రహిస్తోన్నాయనే ఉద్దేశంతో వాటి వినియోగాన్ని నిషేధించింది అమెరికా.
అటు దౌత్యపరంగానూ ఈ రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వైఖరి కొనసాగింది అప్పట్లో. తమ కాన్సులేట్లను సైతం మూసివేసింది అమెరికా. రాయబారులను వెనక్కి పిలిపించుకుంది. ఈ రెండు దేశాల మధ్య అలాంటి వాతావరణం ఇప్పుడు లేదనడానికి గ్ఝి జిన్పింగ్.. పర్యటనే తాజా ఉదాహరణగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications