జో బైడెన్! మీరు మాకు ద్రోహం చేశారు: వైట్హౌస్ ఎదుట ఆప్ఘన్ జాతీయుల ఆందోళన
వాషింగ్టన్: ఆప్ఘానిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి అమెరికా చేసిన ఘోరమైన తప్పిదమే కారణమని ఆఫ్ఘాన్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సేనలు అర్ధాంతరంగా ఆప్ఘనిస్థాన్ నుంచి వీడటం అగ్రరాజ్యం చేసిన మహా అపరాధంగా పరిణమించింది. ఇక అమెరికాలోని ఆప్ఘన్ వాసులైతే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
Recommended Video
ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆప్ఘనిస్థాన్పై తాలిబన్లు పైచేయి సాధించడానికి బైడెన్ తీసుకున్న నిర్ణయమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ ఎదుట పెద్ద సంఖ్యలో ఆప్ఘాన్ దేశీయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జో బైడెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'బైడెన్ మీరు మమ్మల్ని మోసం చేశారు', బైడెన్ మీరే బాధ్యులు అంటూ నినాదాలు చేశారు

అమెరికాలోని ఆప్ఘన్ వాసులు. ఆప్ఘాన్ ప్రజలు మళ్లీ తాలిబన్ల బారినపడి ఉండాల్సింది కాదని అన్నారు. ఆప్ఘనిస్థాన్లో ఇక మహిళలకు భవిష్యత్ ఉండదు. తాము మళ్లీ ఆంక్షల మధ్య జీవించాలనుకోవడం లేదు. అది స్వేచ్ఛకాదు అంటూ ఆప్ఘాన్ మహిళలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. చాలా మంది ఆప్ఘాన్లో ఉంటున్న తమ కుటుంబసభ్యుల క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఆప్ఘాన్ తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటి వరకు నోరు మెదపకపోవడంపైనా ఆగ్రహ జ్వలాలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన తన స్పందనన తెలియజేయలేదు. కాగా, ఆప్ఘాన్ పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్ ఎలా స్పందించాలనేదానిపై ఇప్పటికే వైట్ హౌస్ సలహాదారులు మేథోమధనం నిర్వహిస్తున్నారు. ఇక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా జో బైడెన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ఘన్ దుస్థితికి బాధ్యత వహిస్తూ జో బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశఆరు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరగడానికి, ఆప్ఘాన్లో పరిస్థితులు దిగజారడానికి, సరిహద్దుల్లో దుస్థితికి, ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి బైడెన్ కారణమి దుయ్యబట్టారు.
#WATCH | "Biden you betrayed us, Biden you are responsible," chanted Afghan nationals outside the White House against the US President after Afghanistan's capital Kabul fell to the Taliban pic.twitter.com/giMjt2grNW
— ANI (@ANI) August 16, 2021
అయితే, జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ఘాన్ ప్రభుత్వానికి, దళాలకు అండగా ఉంటూ వస్తున్న అమెరికా భద్రతా దళాలను ఆ దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాలిబన్లు తిరిగి రెచ్చిపోయారు. వరుసగా ఆప్ఘాన్ లోని ప్రధాన పట్టణాలను ఆక్రమించుకుంటూ వచ్చి.. ఇప్పుడు దేశ రాజధానితోపాటు పూర్తి దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆప్ఘాన్లో అరాచక పాలన మొదలైనట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఆప్ఘాన్ ప్రధాని అష్రఫ్.. కజకిస్థాన్ దేశానికి పారిపోయిన విషయం తెలిసిందే. పలుగురు ఆప్ఘాన్ చట్టసభ్యులు భారత్ బాటపట్టారు.
ఇప్పటికే కొందరు ఆశ్రయం కోరుతూ భారత్లోకి ప్రవేశించారు. ఆప్ఘాన్ అభివృద్ధిలో ఎంతో కీలకంగా వ్యవహరించిన భారత్ తమకు సురక్షిత ప్రదేశమని ఆ దేశ చట్టసభ్యులు భావిస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం రాజధాని కాబూల్ తోపాటు ఆప్ఘానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. అన్ని విమానాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం నుంచి ఆప్ఘాన్ చట్టసభ్యులు భారత్ బాటపట్టారు. భారతదేశంలో అడుగుపెట్టిన రాజకీయ ప్రముఖుల్లో వహిదుల్లా కలీమ్జాయ్, వార్దక్ ఎంపీ; అబ్దుల్ అజీజ్ హకీమి, పర్వాన్ నుంచి ఎంపీ; ఎంపీ అబ్దుల్ ఖాదిర్ జజాయ్; సెనేటర్ మాలెం లాలా గుల్; జమీల్ కర్జాయ్, మాజీ ఎంపీ, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ రెండవ బంధువు; బాగ్లాన్ ఎంపీ శుక్రయా ఎసఖైల్; మహమ్మద్ ఖాన్, సెనేటర్ ఇంజనీర్; అబ్దుల్ హది అర్ఘండివాల్, మాజీ ఆర్థిక మంత్రి; మొహమ్మద్ షరీఫ్ షరీఫీ, మాజీ ఉపాధ్యక్షుడు యూనస్ ఖానూనీ సోదరుడు; ఎంపీ మరియమ్ సోలైమన్ఖైల్; కైస్ మొవాఫాక్, ఆఫ్ఘనిస్తాన్ ఎగువ సభకు సీనియర్ సలహాదారు ఉన్నారు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్-భారతదేశాల ప్రజల మధ్య సంబంధాలు శతాబ్దాలుగా బలంగా ఉన్నాయి. అయితే, పాకిస్థాన్, ఐఎస్ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్న తాలిబాన్లు భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం భౌగోళిక రాజకీయ స్థిరత్వానికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ సైనికులు, నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా తాలిబన్లకు పూర్తి సహకారం అందించింది. ఈ నేపథ్యంలో ఆప్ఘాన్ పౌరులు, ప్రజాప్రతినిధులు ఇరాన్, భారత్ తోపాటు ఇతర పొరుగుదేశాలకు వెళుతున్నారు. ఇరాన్ ఇప్పటికే ఆప్ఘాన్ నుంచి వచ్చేవారి కోసం శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేసింది. అల్బేనియా, ఖతార్లు ఆప్ఘాన్ రాజకీయ నేతలకు ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. కెనడా కూడా 20వేల మంది ఆప్ఘాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకుంది. ఐక్యరాజ్యసమితి హై కమిషనర్(యూఎన్ హెచ్సీఆర్) గణాంకాల ప్రకారం.. తాలిబన్ల దాడుల నేపథ్యంలో 2021 ప్రారంభంలో 50 వేల మంది ప్రజలు ఇతర దేశాలకు పారిపోయారు. జులై నుంచి ఆగస్టు 9 వరకు 1,26,000 మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని వెల్లడించింది.
కాగా, కాబూల్ సిటీపై దాడి జరగబోదని, శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నామని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఆ వెంటనే తాలిబన్ మధ్యవర్తుల బృందం ఒకటి అధ్యక్షభవనంలో చర్చలకు వెళ్లింది. రెండు మూడు గంటల చర్చల అనంతరం.. అఫ్గాన్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘని రాజీనామా చేసినట్లు ప్రకటన వెలువడింది. అదే సమయంలో అధికార పగ్గాలను తాలిబన్ నేతలకు అప్పగిస్తున్నట్లూ వెల్లడైంది. శనివారం నాటి ప్రసంగంలో అధ్యక్షుడు ఘని సైనిక సమీకరణపై మాట్లాడటంతో తాలిబన్లు ప్రవేశించే సమయంలో కాబూల్ నగరంలో రక్తపాతం తప్పదనే అంచానలు పెరిగాయి. కానీ అందుకు భిన్నంగా ఆయన ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయారు. ఘని రాజీనామాతో పరిపాలన పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీ అయ్యారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ల సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బరాదర్ బాధ్యతలు చేపట్టడంతో అఫ్గాన్ లో తాలిబన్లకు సంబంధించి నూతన శకం మొదలయినట్లవుతుంది. అష్రఫ్ ఘని రాజీనామాతో పూర్తిగా తాలిబన్ల వశమైపోయిన అఫ్గానిస్థాన్ కు కొత్త అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ నియమితుడయ్యాడు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మొహ్మద్ ఒమర్ కు అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన బరాదర్.. అధికారికంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు కూడా. ప్రస్తుతం తాలిబన్ల రాజకీయ వ్యూహాలకు ఇంచార్జిగా ఉన్న ఆయన.. అధికార మార్పిడికి సంబంధించి పలు అంతర్జాతీయ వేదికలపై జరిగిన చర్చల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు.












Click it and Unblock the Notifications