Dhoni duckout: ఐపీఎల్ చరిత్రలోనే అరుదు: ఆరేళ్ల తరువాత ఫస్ట్ టైమ్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్లో భాగంగా.. శనివారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్.. ధోనీ అభిమానులను నిరాశ పరచింది. సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చూడొచ్చని, అతని కేప్టెన్సీ మెరుపులను ఎంజాయ్ చేయవచ్చని ఆశించిన ఫ్యాన్స్.. మ్యాచ్ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో ఎదురైన పరాజయాల పరంపరం ధోనీ సేనను ఇంకా వీడనట్టే కనిపిస్తోంది. 188 పరుగుల భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది.
భారీ స్కోర్ చేసినా..
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్.. ఓపెనర్లను వెంటవెంటనే కోల్పోయినప్పటికీ.. ఆ తరువాతి బ్యాట్స్మెన్లు కుదురుకోవడంతో భారీ స్కోర్ చేయగలిగింది. వన్డౌన్ మొయిన్ అలీ, సురేష్ర్ రైనా మెరుపులు మెరిపించారు. 24 బంతుల్లో రెండు వరుస సిక్సర్లు, నాలుగు బౌండరీలతో అలీ 36, 36 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో సురేష్ రైనా 54 పరుగులు.. జట్టు భారీ స్కోరు చేయడానికి కారణాలయ్యాయి. మిడిలార్డర్లో అంంటి రాయుడు, రవీంద్ర జడేజా చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. చివర్లో ఆల్ రౌండర్ సామ్ కుర్రమ్ 15 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 34 పరుగులు చేయడం హైలైట్.
ధోనీ డకౌట్..
ఇంటర్నేషనల్స్ మ్యాచ్లల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసి, ఒంటి చేత్తో జట్టును గెలిపించిన అనుభవం ఉన్న ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్లో డకౌట్ కావడం మరో హైలైట్. ఎదుర్కొన్న రెండో బంతికే అతను పెవిలియన్ బాట పట్టాడు. ఢిల్లీ కేపిటల్స్ బౌలర్ అవేష్ ఖాన్ సంధించిన బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. క్లిన్ బౌల్డ్ అయ్యాడు. అవేష్ వేసిన లెంగ్తీ బాల్ను డిఫెండ్ చేయలేకపోయాడు. అది కాస్తా వికెట్లను ఎగురగొట్టింది. అప్పటికి జట్టు స్కోరు 15.3 ఓవర్లకు 136. ఐపీఎల్ చరిత్రలో ధోనీ డకౌట్ కావడం ఇది నాలుగోసారి. ఇదివరకు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచుల్లో ధోనీ సున్నాకే వెనుదిరిగాడు.
ఓపెనర్ల జోడీ దూకుడు ముందు..
చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగులు విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్.. ఏ మాత్రం తడబడలేదు. భారీ లక్ష్యాన్ని ఊది అవతల పారేసింది. జట్టు ఓపెనర్లు పృథ్విషా, శిఖర్ ధావన్ ఏ మాత్రం బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. తొలి బంతి నుంచే చితకబాదారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. పృథ్వీ షా-శిఖర్ ధవన్ జోడీని వీడగొట్టడానికి ధోనీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తొలి వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యం అందించారంటే వారి దూకుడు ఏ రేంజ్లో కొనసాగింతో అర్థం చేసుకోవచ్చు. పృథ్విషా, శిఖర్ ధవన్ 85 పరుగులు చేశారు.
ఫలించని ధోనీ వ్యూహాలు..
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ల చుట్టు ఉచ్చు పన్నడంలో ధోనీ దిట్ట. కేప్టెన్సీతోనే పలు మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు సైతం ఉన్నాయి. అలాంటి వ్యూహాలు, ఉచ్చులేవీ ఈ సారి కనిపించలేదు. అలాంటి వ్యూహాలకు పదును తగ్గిందనే విషయాన్ని పృథ్వీ షా, శిఖర్ ధావన్ నిరూపించినట్టయింది. బౌలర్లను మార్చడం, వారిద్దరి బ్యాటింగ్ శైలికి అనుగుణంగా ఫీల్డర్లను మోహరిపంజేసినప్పటికీ.. ఫలితం రాలేదు. వికెట్ కోల్పోకుండా వారిద్దరూ భారీ షాట్లతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, సామ్, దీపక్ చాహర్.. ఇలా ఏ ఒక్కరినీ వదలి పెట్టలేదు. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ను చితకబాదారు.