జగిత్యాల : శవం వద్ద పూజలు... మంత్రాలతో చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని...
ఓవైపు టెక్నాలజీతో,సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచమంతా దూసుకుపోతుంటే... ఇప్పటికీ కొన్నిచోట్ల మూఢనమ్మకాలు ప్రజలను అంధకారంలోకి నెడుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది.చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ ఓ వ్యక్తి శవం దగ్గర పూజలు చేశాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని టీఆర్ నగర్లో నివాసముండే ఓర్సు రమేష్ అనే వ్యక్తి శుక్రవారం(ఆగస్టు 13) తెల్లవారుజామున చనిపోయాడు. పుల్లయ్య అనే వ్యక్తి మంత్రాలు చేయడం వల్లే రమేష్ చనిపోయాడని కుటుంబ సభ్యులు అనుమానించారు. అతన్ని ఇంటినుంచి లాక్కొచ్చి చితకబాదారు. దీంతో పుల్లయ్య మళ్లీ మంత్రాలతో అతన్ని బతికిస్తానని చెప్పాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రమేష్ శవం వద్ద పూజలు చేశాడు. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. సాయంత్రం సమయంలో పోలీసులు టీఆర్ నగర్కు చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం అక్కడినుంచి జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు పలుచోట్ల వెలుగుచూశాయి.ఏడాది క్రితం మంచిర్యాల జిల్లా కుందారంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.బాలింతకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని... ఓ భూత వైద్యుడు ఆమెను విపరీతంగా కొట్టాడు.జుట్టు పట్టుకొని ఆమె చెంపలపై చెడామడా వాయించాడు. అనంతరం ఆమెను గట్టిగా మంచంపై తోసేశాడు. ఉలుకు పలుకు లేకుండా పడిపోయిన రజితని చూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ ఆస్పత్రికి తరలించారు.
భూతవైద్యుడు కొట్టిన దెబ్బల కారణంగా తీవ్ర గాయాలపాలైన ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని పుట్టింటివారు భూతవైద్యుడు కొట్టిన దెబ్బలకే రజిత ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ భూత వైద్యుడిని,అతనికి సహకరించిన రజిత బాబాయిని అరెస్టు చేశారు. రజిత మృతితో ఇంకా సంవత్సరం కూడా నిండని ఆమె బిడ్డ తల్లి లేనిదైంది.మూఢ నమ్మకాలతో ఓ బిడ్డను తల్లికి దూరం చేశారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. భూత వైద్యం,మంత్ర తంత్రాలను నమ్మవద్దని... జబ్బు చేస్తే వైద్యుల వద్దకు వెళ్లాలని... మానసిక స్థితి సరిగా లేకపోతే సైక్రియాటిస్ట్లను సంప్రదించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.