జై కేటీఆర్ నినాదాలు.. సర్వమత పెద్దల ఆశీర్వచనాలు.. గులాబీమయంగా కరీంనగర్
కరీంనగర్ : ఎన్నికల సభను తలపించింది. ప్రచార పర్వాన్ని మించిపోయింది. గులాబీ పార్టీ ఇన్నర్ మీటింగ్ ప్రత్యర్థుల ఊహాలకు అందకుండా పోయింది. కరీంనగర్ లో నిర్వహించిన సదస్సు పార్లమెంటరీ స్థాయిదే ఐనా.. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అగ్రశ్రేణి నాయకులు తరలిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 16 స్థానాలను కైవసం చేసుకునేలా టీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది.
కరీంనగర్ శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్న టీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహాక సదస్సుకు.. టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ తో పాటు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పార్టీ ముఖ్యనేతలతో పాటు క్యాడర్ కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు సదస్సుకు వచ్చారు.
మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?
కరీంనగర్ చేరుకున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా పార్టీశ్రేణులు అడుగడుగునా నీరాజనం పలికారు. సభాస్థలికి చేరుకోగానే జై టీఆర్ఎస్, జై కేటీఆర్ నినాదాలు మిన్నంటాయి. వేదికపై చేరుకోగానే సర్వమత పెద్దలు కేటీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు. టీఆర్ఎస్ ముఖ్యులు చాలామంది వేదికను పంచుకున్నారు. కేసీఆర్ కు ఎలాంటి గౌరవం ఇచ్చేవారో.. అదే స్థాయిలో కేటీఆర్ ను ట్రీట్ చేశారు.