ఆదిలోనే హంసపాదు, మొదటిరోజు వివాదంలో కేటీఆర్ పర్యటన?
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం కరీంనగర్లో పర్యటించారు. ఈ పర్యటనకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రోడ్డుపై నిలబెట్టడంపై విమర్శల వస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా పిల్లలను తమ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకోవడం సరికాదు. కానీ ఇప్పుడు తెరాస సమావేశానికి కరీంనగర్లో విద్యార్థులను రోడ్డుపై నిలబెట్టారు.
ఢిల్లీ కోటలో చక్రం తిప్పుదాం.. 16 మంది మనోళ్లను గెలిపిద్దాం : కేటీఆర్
కరీంనగర్ సమావేశానికి హాజరవుతున్న కేటీఆర్కు స్వాగతం పలికేందుకు పాఠశాల విద్యార్థులను నడిరోడ్డుపై నిలబెట్టి ఇబ్బంది పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థినీ, విద్యార్థులు టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని, పార్టీ నేతకు స్వాగతం పలికేందుకు రహదారిపై వరుసగా నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పాఠశాల విద్యార్థులను ధర్నాలకు, రాస్తారోకోలకు తీసుకువెళ్తే కేసులు పెడతామని ప్రభుత్వ అధికారులు చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఏకంగా పార్టీ నాయకులే విద్యార్థులను తమ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారని, ఎండలో నిలబెట్టారని, దీనిపై ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.