కర్నూలులో ఏపీ జేఏసీ అమరావతి మహాసభ: ఛైర్మన్, సెక్రెటరీ జనరల్ ఎన్నికలో కీలక పరిణామం..!!
ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం ఇవ్వాళ కర్నూలులో ఏర్పాటైంది. ఈ సందర్భంగా కొత్త కమిటీ ఎన్నికైంది. ఛైర్మన్ గా బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ గా పలిశెట్టి దామోదర్ రావు ఎన్నికయ్యారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యవర్గం ఇవ్వాళ కర్నూలులో ఏర్పాటైంది. నగరంలోని రెవెన్యూ భవన్ లో జరిగిన ఈ కమిటీ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు సభ్యులు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ గా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. సెక్రెటరీ జనరల్ గా పలిశెట్టి దామోదర్ రావును ఎన్నుకున్నారు. వారి ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
కోటంరెడ్డికి సడన్ చెక్: బెదిరింపు ఫోన్ కాల్స్ వేళ.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 21 మంది కార్యవర్గ సభ్యులు వేర్వేరు హోదాల్లో పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్ గా, పలిశెట్టి దామోదర్ రావు సెక్రటరీ జనరల్ గా నామినేషన్ వేశారు. ఈ రెండింటితో పాటు మొత్తం 21 పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు అయ్యాయి. ఆయా పదవులకు పోటీ లేకుండా పోయింది. దీనితో బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్ తో పాటు మిగిలిన రాష్ట్ర కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జరగబోయే కౌన్సిల్ సమావేశం సందర్భంగా వారి నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఎన్నికల ప్రధాన రిటర్నింగ్ అధికారి కే భావనా రుషి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి కృష్ణా రావు తెలిపారు. రిటర్నింగ్ అధికారులకు అందిన నామినేషన్ లు ఆధారంగా అభ్యర్థుల లిస్టులను వారు విడుదల చేశారు.
పోస్టుల వారీగా చూస్తే- ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ గా బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ గా పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ గా టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారిగా వీవీ మురళి కృష్టం నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఎస్ కృష్ట మోహన్ రావు, ప్రచార కార్యదర్శిగా బీ కిశోర్ కుమార్ ఎన్నికయ్యారు. వారితోపాటు అయిదుమంది చొప్పున కో-ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కార్యదర్శులు ఏపీ జేఏసీ అమరావతికి ఎన్నికయ్యారు. మొత్తంగా 21 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ కార్యవర్గ కమిటీ సమావేశానికి కొనసాగింపుగా కర్నూలులోనే ఆదివారం భారీ ఎత్తున జేఏసీ అమరావతి మహా సభలు నిర్వహించనున్నట్లు బొప్పరాజు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం ఏడాది కిందట హామీ ఇచ్చిందని, ఇప్పటికీ అది అమలు కావట్లేదని అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, దీనికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను జేఏసీ అమరావతి మహాసభల్లో ఖరారు చేస్తామని చెప్పారు.