సనాతన ధర్మం కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యం.. బండి సంజయ్..
తెలంగాణలో హిందూ పాలన రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మాలను కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో హిందు పాలన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సంజయ్ పిలుపునిచ్చారు. రామ మందిర నిర్మాణానికి వచ్చే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రతి హిందువు నిధి సహకారం కోసం పని చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్ధీపూర్ గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో జరిగిన దత్త జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
సనాతన ధర్మాన్ని కించపరిచే నాయకులు, వారి పాలన మనకు అవసరం లేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. బీహర్లో 12 శాతం ఉన్న ముస్లింలు మతం పేరుతో గెలిస్తే తెలంగాణలో 80 శాతం ఉన్న హిందువులు ఎక్కువ సీట్లు ఎందుకు గెలవవద్దు అని ప్రశ్నించారు. అక్కడ వారికి అనుకూలం ఉండగా.. మనకెందుకు సానుకూలం కాదు అని అడిగారు. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు ఏ పార్టీలో తిరిగినా ఒకచేత పార్టీ జెండా.. మరో చేత కషాయం జెండా పట్టాల్సిందేనని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో విజయంతో బీజేపీ మాంచి ఊపు మీద ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీపై సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతోంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా బండి సంజయ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ హిందూ పాలన గురించి సంచలన వ్యాఖ్యలు గురించారు. అన్నీ పార్టీలు కషాయ జండా పట్టుకోవాలని కొత్తగా పిలుపునిచ్చారు.