వారికి కోటి రూపాయల రివార్డ్ ఇవ్వండి.. వివేకా హత్యకేసు, సీబీఐ రివార్డ్ పై ఎంపీ రఘురామ హాట్ కామెంట్స్ !!
నిత్యం ఏదో ఒక అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ జగన్ ను ఇరకాటంలో పెట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ హల్ చల్ చేస్తున్న వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై స్పందించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ విచారణ సాగించిన సిబిఐ తాజాగా అనూహ్యంగా చేసిన ప్రకటనపై రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టార్గెట్ 2022: యూపీలో బిగ్ ప్రాజెక్ట్: రూ.5 వేల కోట్ల పీఎన్బీ లోన్
వైఎస్ వివేకా కేసు సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామన్న సీబీఐ
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ కేసుకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి ఐదు లక్షల రూపాయలను ఇస్తామని కీలక ప్రకటన చేసింది .ఈ కేసుకు సంబంధించి ఖచ్చితమైన నమ్మదగిన సమాచారాన్ని అందించిన వారికి రివార్డు ఇస్తామని, వారి వివరాలను గోప్యంగా కూడా ఉంచుతామని సిబిఐ అధికారులు వెల్లడించారు. వారి ఫోన్ నెంబర్ల ద్వారా కానీ, కార్యాలయంలో కానీ తమను సంప్రదించవచ్చని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు.
76 రోజులుగా కొనసాగుతున్న విచారణ.. తాజాగా ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ
76 రోజుల నుండి వరుసగా ఈ కేసుపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు అనేక మంది అనుమానితులను పలు దఫాలుగా ప్రశ్నించారు. కీలక నిందితులను అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో త్వరలో నేరస్తులు ఎవరో బయటపడతారని, త్వరగానే సీబీఐ ఈ కేసును ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సీబీఐ తాజాగా చేసిన ప్రకటన ఈ కేసులో ఇంకా కీలక సమాచారం దొరకలేదా అన్న అనుమానాలకు కారణంగా మారింది. తాజాగా ఈ కేసులో ఇంకా స్పష్టమైన ఆధారాలను సేకరించాల్సి ఉన్నందున వివేకా హత్య కేసుకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల రూపాయల రివార్డు ఇస్తామని వెల్లడించారు.
సాక్ష్యం చెప్పే వారికి కోటి రూపాయల రివార్డు ఇవ్వండి : ఎంపీ రఘురామ
దీనిపై వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సిబిఐ ప్రకటించిన ఐదు లక్షల రూపాయల నగదు రివార్డు ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సమాచారం ఇచ్చేవారికి కచ్చితంగా ప్రాణభయం ఉంటుందని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు సమాచారం అందించే వారికి కోటి రూపాయల రివార్డు ఇవ్వాలని సూచించారు. సిబీ ఐ 5 లక్షల రివార్డు ఇస్తే, ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యం చెప్పే వారికి జగన్ కోటి రూపాయలు రివార్డు ఇవ్వాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తేనే పట్టుకుంటారు కానీ వివేకా కేసులో
శనివారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన వివేకానంద హత్య కేసును త్వరితగతిన తేల్చాలని భావిస్తున్న సిబిఐ, సత్వర విచారణలో భాగంగానే రివార్డు ప్రకటించి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం పై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే వెంటనే పట్టుకుంటున్నారని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు మరి వివేకా హత్య కేసులో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు అంటూ ప్రశ్నించారు.
ఈ కేసు నిందితుడు శ్రీనివాసరెడ్డి హత్య, త్వరలో కేసు తేలుతుందని ఆశాభావం
వివేకానంద రెడ్డి హత్య కేసు పై కొనసాగుతున్న సస్పెన్స్ నేపథ్యంలో మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయ్ వివేకా హత్య కేసు పై వివరాలు తెలిసినా చెప్పేందుకు భయపడతారని పేర్కొన్నారు. ఈ కేసులో ఉన్న శ్రీనివాసరెడ్డి గతంలోనే హత్యకు గురయ్యాడని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి కూడా రక్షణ కోరారని తెలిపిన రఘురామ కృష్ణంరాజు ఏది ఏమైనా త్వరితగతిన సిబిఐ అధికారులు ఈ కేసు విచారణ పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిందితులను కనిపెట్టి వారికి శిక్షపడేలా చేయాలని పేర్కొన్నారు.