ప్రజలే సీఎం పదవీ భిక్ష పెట్టారు.. జానా రెడ్డి కాదు, హాలియా సభలో కేసీఆర్ నిప్పులు
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. హాలియాలో బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నాగార్జున సాగర్కు జానారెడ్డి ఏమీ చేయలేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పేదలను పట్టించుకోలేదని తెలిపారు. జానారెడ్డి మాట్లాడితే 30 ఏళ్ల చరిత్ర అంటాడని విమర్శించారు. నందికొండ మున్సిపాలిటీని అనాధను చేశాడని కామెంట్ చేశారు.
ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు
30 ఏళ్లలో డిగ్రీ కాలేజీ కూడా లేదు
గత 30 ఏళ్లలో నాగార్జునసాగర్కు డిగ్రీ కాలేజీ కూడా దిక్కులేదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. నోముల భగత్కు ఏ విధంగా ఓట్లు వేస్తారో అదే విధంగా నెల్లికల్లు లిఫ్ట్ నీళ్లు కూడా దూకుతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. గత పాలకులు వదిలేసిన తిరుమలగిరి సాగర్ లిఫ్ట్ను భిక్షమెత్తైనా సరే ఒక్కటిన్నర ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. నందికొండ మున్సిపాలిటీలో స్థలాల సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పారు. నాగార్జున సాగర్కు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ప్రజలే సీఎం పదవీ భిక్ష పెట్టారు
తెలంగాణ ప్రజలు తనకు సీఎం పదవీ భిక్ష పెట్టారని.. జానారెడ్డి కాదని కేసీఆర్ అన్నారు. ఉద్యమంలో పదవులు గడ్డి పూసల్లా వదిలేశామని గుర్తుచేశారు. పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. తెలంగాణ కోసం చాలాసార్లు రాజీనామా చేశాం అని.. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చక్కగా ఉంటే ఎందుకు గులాబీ జెండా ఎగరాల్సి వచ్చిందో ఒక్కసారి ఆత్మవలోకనం చేసుకోవాలని కోరారు. సభ జరగకూడదని ప్రతిపక్షాలు చేయని ప్రయత్నం లేదు. ఎవరైనా సభలు పెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో భాగం అని చెప్పారు.
నిజనిజాలు తెలుసుకోవాలి..
ఎవరెన్ని చెప్పినా ప్రజలు నిజనిజాలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నం అయ్యిందన్నారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే కుదరదని తేల్చిచెప్పారు. వాస్తవాలు మీ కళ్ల ముందే ఉన్నాయని... ఎవరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో తెలుసు అన్నారు. నాగార్జున సాగర్లో భగత్ గాలి బాగానే ఉందని అర్థమైందన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు అని చెప్పారు.
ఆగం ఆగం చేశారు..
గత పాలకులు తిరుమలగిరి మండలాన్ని ఆగం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వేసే ముందు న్యాయం ఎవరివైపు ఉందో ఆలోచించాలని పదే పదే కోరారు. నాగార్జున సాగర్లో సంక్షేమ పథకాలు అందడం లేదా అని నిలదీశారు. పైరవీలు లేకుండా పాలన సాగిస్తున్నాం అని కేసీఆర్ అన్నారు. ప్రజలకు సంక్షేమం అందుతుందని చెప్పారు. అన్నీ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.