కాంగ్రెస్ కు పవన్ మద్దతిస్తారా: వీహెచ్ రాయబారం: జనసేనాని ఆలోచన ఏంటి..!
తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతోంది. అధికార టీఆర్ యస్ మొదలు అన్ని పార్టీలు విజయం సాధించటానికి మద్దతిచ్చే వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ యస్ పాత రాజకీయాలను మరించి హుజూర్ నగర్ లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా సీపీఐ మద్దతు సంపాదించింది. ఇక, సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురైంది. టీడీపీ సైతం బరిలో నిలిచింది. అయితే..టీఆర్ యస్.. కాంగ్రెస్.. బీజేపీ..టీడీపీ అభ్యర్దుల మధ్య ఇప్పుడు ప్రధాన పోటీ ఉంది. అందునా కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావటంతో ఎలాగైనా గెలవాలని అధికార టీఆర్ యస్ పార్టీ పట్టుదలతో ఉంది. దీని కోసం పెద్ద ఎత్తున పార్టీ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ మొహరించారు. దీంతో..ఇప్పుడు అక్కడ ఉన్న పోటీలో తమ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ మద్దతు కోరుతూ లేఖ ఇచ్చారు.
పవన్ మద్దతు కోసం కాంగ్రెస్..
అనూహ్యంగా సీపీఐ మద్దతు టీఆర్ యస్ పార్టీ సంపాదించటంతో అందుబాటులో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేత వీహెచ్ కోరుతున్నారు. గతంలో ఆయన అడిగిన వెంటనే యురేనీయం ఉద్యమానికి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. వీహెచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి పవన్కల్యాణ్ హాజరై మద్దతు తెలిపారు. దీంతో..కాంగ్రెస్ తరపున హుజూర్నగర్ బైపోల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న పద్మావతి రెడ్డికి మద్దతు ఇవ్వాలని పవన్ ను కోరారు. ఇందు కోసం వీహెచ్ జనసేన కార్యాలయానికి వెళ్లగా..పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో చికిత్స కారణంగా అందుబాటులో లేరని అక్కడి నేతలు సమాధానమిచ్చారు. దీంతో..జనసేన తెలంగాణ ఇన్ ఛార్జ్ శంకర్ గౌడ్.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్..పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తో చర్చలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు కోరుతూ అధికారికంగా లేఖ అందించారు.

పవన్ మద్దతుగా నిలుస్తారా..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ కోరినా..ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనాని మద్దతుగా నిలుస్తారా అనేది సందేహమే. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే తెలంగాణతో పాటుగా ఏపీలోనూ పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో వామపక్షాలు పోటీలో లేవు. వామపక్ష పార్టీల్లో సీపీఐ అధికార టీఆర్ యస్ కు మద్దతిస్తుండగా..సీపీఎం పోటీలో లేదు. దీంతో జనసేన అధినేత సైతం ఏ పార్టీకి మద్దతు ప్రకటించకుండా మౌనం పాటించే అవకాశం ఉంది. గతంలో ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ చివరి నిమిషం వరకు అప్పటి అధికార పార్టీ టీడీపీ తమకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటిస్తారని ఆశించింది. నేరుగా పోటీలో లేకపోయినా..భూమా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మద్దతిస్తారని అంచనా వేసారు. అయితే..భవిష్యత్ రాజకీయాలను పరిగణలోకి తీసుకున్న పవన్ తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వటం లేదని..తటస్థంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు. ఇప్పుడు హుజూర నగర్ లో సైతం పవన్ అదే విధానం అనుసరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications