మునుగోడు ప్రజలు అనాథలా: రాజగోపాల్ రెడ్డి, 12 మందితో రాజీనామా చేయించు: బండి
మునుగోడు ప్రచారం హీటెక్కింది. నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ను రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించడం తెలిసిందే. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు.
కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మనుగోడు నియోజకవర్గ ప్రజలు ఏమైనా అనాథలా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడని స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి సరైన నేతలే కరవయ్యారా? అని అడిగారు. టీఆర్ఎస్ అభ్యర్తి డమ్మీనా అని అడిగారు.
సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ కు దమ్ముంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి వారిని గెలిపించుకునే సత్తా కేసీఆర్కు లేదని సంజయ్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని బండి సంజయ్ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చిన టీఆర్ఎస్... హుజూరాబాద్ ఉప ఎన్నికలో రూ.20 వేలు ఇచ్చిందని ఆరోపించారు.