నెల్లూరు జిల్లాకు వైఎస్ జగన్: రూ.3,736 కోట్లతో భారీ ప్రాజెక్ట్
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గుడ్లూరు మండలంలోని మొండివారిపాలెం వద్ద రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు.
పోర్టును నిర్మించదలిచిన ప్రదేశం వద్ద పైలాన్, హెలిప్యాడ్ నిర్మాణ పనులను ఆయన ఇదివరకే పరిశీలించారు. ఈ పోర్ట్ నిర్మాణ వ్యయం 10,640 కోట్ల రూపాయలు. రెండు దశల్లో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకుంది. తొలి విడత పనుల కోసం 3,736 కోట్ల రూపాయలను కేటాయించింది కూడా. దశలవారీగా అభివృద్ధి చేయనుంది. మూడు ఓడరేవులు, తొమ్మిది షిప్పింగ్ హార్బర్లు, మల్టీ-మోడల్ పార్కులను తీర ప్రాంతాల వెంబడి అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. రామాయపట్నం పోర్ట్ నిర్మాణం ఇందులో భాగమే.

పోర్ట్ నిర్మాణం నేపథ్యంలో భూమిని కోల్పోనున్న 600 కుటుంబాలకు నష్ట పరిహారాన్ని చెల్లించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్-2013 ప్రకారం.. వారికి పరిహారాన్ని చెల్లించనుంది. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాల్లో మొత్తం 600 కుటుంబాలను గుర్తించింది. ఆయా గ్రామాల ప్రజలు పోర్ట్ నిర్మాణానికి అంగీకారం తెలిపారని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తోన్నారు. కావలి, కందుకూరు ప్రాంతాల్లో వీఐపీ, వీవీఐపీలకు బస ఏర్పాటు చేయనున్నారు. రామాయపట్నం పోర్ట్ నిర్మాణం వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది. పోర్ట్కు అనుబంధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయని స్పష్టం చేస్తోంది. ఆయా ఉపాధి కల్పన కార్యక్రమాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామనీ పేర్కొంది.












Click it and Unblock the Notifications