నెల్లూరులో సైకిళ్ల పంపిణీ! వాటిపై చంద్రబాబు ఫొటో: అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు
నెల్లూరు: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోవట్లేదని, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన సైకిళ్లను వాళ్లు పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. సైకిళ్లపై చంద్రబాబు నాయుడు, నారాయణ ఫొటోలు ఉండటం.. వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆరోపణలకు బలాన్నిస్తోంది.
నిన్న నగదు..నేడు సైకిళ్లు
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెర తీసిన విషయం తెలిసిందే. విజయవాడలోని సత్యనారాయణ పురం పోలీసులు 91 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇన్నోవా కారులో తరలిస్తున్న ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని బ్లాక్ మనీగా గుర్తించినట్లు వెల్లడైంది. భూమి కొనుగోలు కోసం రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం నుంచి ఈ మొత్తాన్ని తరలిస్తున్నట్లుగా తేలినట్లు పోలీసులు చెప్పారు.
అదే సమయంలో- గుంటూరు జిల్లాలో మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కుట్టుమిషన్లను పంపిణీ చేసినట్లు సమాచార ఉంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలకు వాటిని సరఫరా చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో- నెల్లూరులో పెద్ద ఎత్తున సైకిళ్ల పంపిణీ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
సైకిళ్లతో వెళ్తున్న వాహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ డ్రైవర్ ను ప్రశ్నించగా.. సరైన సమాధానం రాలేదు. దీనితో వారు సైకిళ్లు సహా వాహనాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
పోలింగ్ కు నెలరోజుల వ్యవధి కూడా లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలకు దిగాయి. నగదు సహా చీరెలు, వెండి వస్తువులు, సైకిళ్లు, కుట్టు మిషన్లు.. ఇలా అన్ని రకాల వస్తువులతో ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నాయి. తమ విలువైన ఓటును ఎవరికీ అమ్ముకోకూడదంటూ స్వచ్ఛంద సంస్థలు చేస్తోన్న ప్రచారాలు ఎవరి చెవికీ ఎక్కని పరిస్థితి ఏర్పడింది. నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే ప్రలోభాల పర్వానికి తెర తీసిన నాయకులు.. పోలింగ్ ముగిసే సమయానికి దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్తారనడంలో సందేహాలు అనవసరం.